కర్నూలు(అగ్రికల్చర్): ఎల్నినో ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటలను శాస్త్రవేత్తల బృందాలు పరిశీలిస్తున్నాయి. కర్నూలు ఏరువాక కేంద్రం, బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం, నంద్యాల ఆర్ఏఆర్ఎస్ శాస్త్రవేత్తలు బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయికి వెళ్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆదేశాల మేరకు ఎల్నినో కాంబాట్ శాస్త్రవేత్తలు బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలిస్తూ.. రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. కర్నూలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల బృందం కోడుమూరు, గూడూరు, కల్లూరు మండలాల్లో పర్యటించింది. ప్రస్తుతం పంటల పరిస్థితి ఎలా ఉంది.. పంటలు కోలుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి... ఆగష్టు, సెప్టెంబరు నెలల్లో వేసుకోవాల్సిన ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు ఏరువాక కేంద్రం ప్రదాన శాస్త్రవేత్త డాక్టర్ సుజాతమ్మ తెలిపారు. వారి వెంట కల్లూరు ఏవో విష్ణువర్థన్రెడ్డి, అసిస్టెంటు ప్రొఫెసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు.


