బండిఆత్మకూరు: మండలంలోని పెద్ద దేవళాపురం గ్రామానికి చెందిన ఢమావత్ శంకరమ్మ (58) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై ఎస్ఐ జగన్మోహన్ తెలిపిన వివరాల మేరకు.. శంకరమ్మ సోమవారం రాత్రి ఇంట్లో కాలుజారి కింద పడగా కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. మృతురాలి కుమారుడు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.
సాంబార్లో పడి చిన్నారికి తీవ్రగాయాలు
దేవనకొండ: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన ఉపేంద్ర, లలిత దంపతుల కుమార్తె మీనా (4) ప్రమాదవశాత్తు వేడి సాంబారులో పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఉపేంద్ర తన పొలంలో బోరు మోటార్ దింపి కార్మికులకు భోజనాలు పెట్టేందుకు ఇంటి వద్ద వంట సిద్ధం చేశారు. ఉడికిన సాంబారు పాత్రను కిందకు దింపి ఉంచగా అక్కడ ఆడుకుంటున్న పాప పాత్రలో పడింది. గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన బయటికి తీసి దేవనకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడినుంచి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు.
పాముకాటుతో వ్యక్తి మృతి
బనగానపల్లె రూరల్: మండలంలోని నందివర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని రామతీర్థం గ్రామానికి చెందిన రామమద్దిలేటి (41)ని పాము కాటు వేయడంతో మృతి చెందాడు. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. రామమద్దిలేటి లారీ డ్రైవర్గా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి పలుకూరులో డ్రైవింగ్ పని ముగించుకొని రామయ్య అనే వ్యక్తితో కలిసి స్వగ్రామానికి బైక్పై బయలుదేరాడు. ఊరువాకిలి సమీపంలో బైక్ దిగి రోడ్డు పక్కన రామమద్దిలేటి మూత్రం పోస్తుండగా కాలికి విషసర్పం కాటువేసింది. కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో వెంటనే చికిత్స కోసం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే రామమద్దిలేటి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు కుమారులు ఉన్నారు. నందివర్గం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
పత్తికొండ రూరల్: మండల పరిధిలోని హోసూరు గ్రామానికి చెందిన మాల రవి (30) మంగళవారం పాముకాటుకు గురై మృతి చెందాడు. రంగన్న, రామాంజినమ్మల కుమారుడైన రవి కూలీ పనులు చేసుకుంటూ జీవించేవాడు. నెల రోజుల క్రిందట దేవనకొండకు చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆషాఢ మాసం కావడంతో ఆమె పుట్టింటికి పోగా, భార్యను పలకరించేందుకు వెళ్లి అక్కడ పడుకుని ఉండగా పాముకాటుకు గురై అపస్మారక స్థితిలో పడిపోగా చికిత్స నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పెళ్లైన నెల రోజులకే మృత్యుఒడికి చేరడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


