గోనెగండ్ల: వలస వెళ్లొద్దు.. గ్రామంలోనే పనులు చేసుకుందామని తండ్రి అనడంతో కుమారుడు క్షణికావేశంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని బెలుప్పల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు గోనెగండ్ల మండలం బైలుప్పల గ్రామానికి చెందిన ఈరన్న, సుబ్బమ్మల కుమారుడు చరణ్ (18) కూలీ పనులు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. చరణ్ పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తండ్రి ఈరన్నతో తాను వేరే ప్రాంతానికి పని కోసం వలస వెళతానని చెప్పగా ఆయన అంగీకరించలేదు. గ్రామంలోనే కూలీ పనులు చేసుకుందామని చెప్పాడు. తండ్రి తన మాట వినలేదని చరణ్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి తిరిగివచ్చి వాంతులు చేసుకుంటున్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు ఏమైందని అడగ్గా పురుగు మందు తాగినట్లు చెప్పాడు. వెంటనే చికిత్స కోసం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కోలుకోలేక సోమవారం ఉదయం చరణ్ మృతిచెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రబాబు తెలిపారు.


