పాణ్యం: రాయలసీమకు తలమానికంగా ఉన్న గోరుకల్లు జలాశయ రివిట్మెంట్ పనులు నత్తతో ప్రయాణం చేస్తున్నట్లు సాగుతున్నాయి. ఇంకా పనులు తుది దశకు చేరుకోకపోవడంతో ఈ ఏడాది గోరుకల్లులో నీటిని నిల్వ ఉంచుతారా? లేదా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఏడాది వర్షాలు లేక రైతులు, ప్రజలు సాగు, తాగునీటి కోసం ఎంతలా అల్లాడుతున్నారో చూస్తున్నాం. ఇలాంటి సమయంలో పైనుంచి వస్తున్న వరద నీరు శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరుతున్న తరుణంలో అక్కడి నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బానకచర్ల క్రాస్ ద్వారా ఎస్సార్బీసీ నుంచి గోరుకల్లుకు చేరుకుంటాయి. అయితే ఈ ఏడాది గోరుకల్లు జలాశయంలో నీటి నిల్వ ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది జలాశయంలో 8 టీఎంసీల నీరు నిల్వ ఉన్న సమయంలో కట్ట కుంగిపోవడం ప్రారంభమైంది. క్రమంగా కుంగిపోవడం మరింత పెరిగి నీరు నిల్వ ఉంచేందుకు అవకాశం లేకుండా పోయింది. కట్ట మరమ్మతులు చేయడంలో అఽధికారులు జాప్యం చేస్తున్నారు. నేటికీ పనులు పూర్తి కాలేదంటే ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు.
మంత్రి వచ్చి చూసినా..!
రాయలసీమ జీవనాడి అయిన గోరుకల్లు కట్ట కుంగిన ప్రాంతాన్ని సాక్షాత్తు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. పెండింగ్ పనులకు రూ.53 కోట్లు మంజూరు చేస్తున్నట్లు గతేడాది జూన్ 11వ తేదీన హడావుడి చేశారు. తక్షణమే పెండింగ్ పనులు పూర్తి చేయాలని, కట్ట కుంగిన చోట తాత్కాలిక మరమ్మతులకు రూ.కోటిన్నర నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏడాది పూరవుతున్నా పెండింగ్ పనుల ఊసే లేదు. ఇక తాత్కాలిక పనులు మాత్రం నెమ్మదిగా సాగుతున్నాయి. పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో రైతులు, ప్రజలు సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంత ప్రాధాన్యత గల ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహిస్తున్న ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
నత్తతో పోటీ పడుతున్న గోరుకల్లు
రివిట్మెంట్ పనులు
మరో పది రోజుల్లో శ్రీశైలం నుంచి
నీరు వదిలే అవకాశం?
అయినా పూర్తి కాని పనులు
తాత్కాలిక పనుతో తాత్సారం


