కృష్ణగిరి: ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని చుంచుఎర్రగుడి గ్రామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన రైతు వెంకటేశ్వర్లు తన ట్రాన్స్ఫార్మర్ను వేరొక చోటికి మార్చేందుకు గ్రామంలోని ప్రైవేట్ టెక్నీషియన్ రాందాస్ను తీసుకెళ్తూ, అక్కడ హోటల్ వద్ద ఉన్న గొంగళ్ల పెద్ద మద్దయ్య (56)ను వెంట తీసుకెళ్లారు. సాయంత్రం ఐదున్నర గంటలకు త్రీఫేజ్ సప్లయ్ ముగిసిన తర్వాత రైతు, టెక్నీషియన్ ట్రాన్స్ఫార్మర్ మార్చేందుకు వెళ్లగా అక్కడ ఏమీ జరిగిందో గానీ పెద్ద మద్దయ్య మాత్రం విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు. అధికారుల అనుమతులు తీసుకోకుండా విద్యుత్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అయితే పెద్ద మద్దయ్య మృతిపై అనుమానాలు ఉన్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గ్రామానికి ఇన్చార్జ్గా ఉన్న ట్రాన్స్కో లైన్ ఇన్స్పెక్టర్ వెంకటరాముడును వివరణ కోరగా తమకు ఎల్సీ కావాలని ఎవరూ సంప్రదించలేదన్నారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు.
నాలుగు నెలలుగా లైన్మెన్ పోస్టు ఖాళీ
మండలంలోని చుంచుఎర్రగుడి గ్రామంలో నాలుగు నెలలుగా లైన్మెన్ పోస్టు ఖాళీగా ఉండటంతో ఇక్కడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పనిచేస్తున్న లైన్మెన్ పదోన్నతిపై వెళ్లడంతో అప్పటినుంచి ప్రభుత్వం ఈ గ్రామానికి లైన్మెన్ను కేటాయించడంలో నిర్లక్ష్యం వహించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ గ్రామంతోపాటు లక్కసాగరం గ్రామ పంచాయతీకి కూడా లైన్మెన్ లేకపోవడంతో దాదాపుగా 7 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు ఎవ్వరికి చెప్పుకోవాలో తెలియక సతమవుతున్నారు. అత్యధికంగా కనెక్షన్లు ఉన్న గ్రామాలకు రెగ్యూలర్ లైన్మెన్లను నియమించాలని కోరుతున్నారు.


