● తక్కువ ధరకే బియ్యం కౌంటర్లు
ఫొటోలకే పరిమితం
● కాసేపటికే మూసేసిన వైనం
కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు తగ్గింపు ధరలపై నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెబుతున్నా క్షేత్రస్థాయిలే అంతా ఉత్తిదేనని తేలిపోయింది. కర్నూలులోని అమీన్ అబ్బాస్నగర్ రైతుబజారులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ను ఆదివారం రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ప్రారంభించి వెళ్లిన అర గంటకే మూసేయడంతో వినియోగదారులు నిరాశగా వెనుదిరిగారు. బయట మార్కెట్లో స్టీమ్డ్ రైస్ ధర కిలో రూ.62. రా రైస్ ధర రూ.58 ఉందని, ప్రభుత్వం చొరవ తీసుకుని ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్టీమ్ రైస్ రూ.52కే పంపిణీ చేస్తున్నామని ప్రకటించారు. వినియోగదారులు బియ్యం తీసుకునేందుకు ఆసక్తి చూపారు. అయితే కౌంటరును ప్రారంభించి ఐదారుగురికి బియ్యం పంపిణీ చేసి ఫొటోలు దిగి.. మరో చోట కౌంటరును ప్రారంభించాల్సి ఉందని.. మూసేసి వెల్లిపోవడం గమనార్హం. తక్కువ ధరకే బియ్యం పంపిణీ చేస్తున్నామని భారీగా ప్రచారం చేసి.. కౌంటరుకు కేవలం 25 కిలోల బస్తా మాత్రమే తీసుకురావడం చూస్తే ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. మండిబజారులో కూడా హోల్సేల్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో ఒక కౌంటరు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నా... అది కూడా ఫొటోలకే పరిమితమైనట్లు తెలుస్తోంది. అమీన్ అబ్బాస్ నగర్ రైతుబజారులో బియ్యం కౌంటరు ప్రారంభ కార్యాక్రమంలో ఏఎస్ఓ రంజిత్, ఎస్టేట్ ఆఫీసర్ జయమ్మ, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.


