● మరో ఐదుగురికి గాయాలు ● బాధితులను పరామర్శించిన కాటసాని రామిరెడ్డి
కొలిమిగుండ్ల(అవుకు): అయ్యలూరు మెట్ట సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో అవుకు పట్టణానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త జక్కా మధుసూదనరావు (44) మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులో విజయవాడకు వెళ్లి తిరుగు ప్రయాణంలో స్వగ్రామానికి వస్తున్న తరుణంలో నంద్యాల సమీపంలోని అయ్యలూరు మెట్ట వద్ద కారు ప్రమాదవశాత్తు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధుసూదనరావు మృతి చెందగా మరో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, వైఎస్సార్సీపీ అవుకు మండల కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబులరెడ్డి, నాయకులు దుగ్గిరెడ్డి రవీంద్రనాథరెడ్డి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మధు మృతదేహాన్ని సందర్శించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఉదయానంద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కార్యకర్తలను పరామర్శించారు.


