● రోడ్లు మినహా మిగిలిన వాటికి కొత్త అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశం
కర్నూలు(అర్బన్): జిల్లాలో ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రామాలు, ఆయా కాలనీల్లో వివిధ రకాల ప్రాధాన్యత కలిగిన అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన ( పీఎం – అజయ్ ) పనుల్లో మరింత జాప్యం చోటు చేసుకోనుంది. ఈ పథకం కింద గుర్తించిన ఒక్కో గ్రామానికి రూ.20 లక్షలకు తక్కువ కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరవుతాయి. దీంతో రోడ్లు, డ్రైనేజీ, పాఠశాలలు, అంగన్వాడీ భవన నిర్మాణాలు, నీటి వసతి, పైప్లైన్లు, వీధి లైట్ల ఏర్పాటు తదితర అనేక రకాల పనులు చేపట్టవచ్చు. ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లాలో ఫేజ్ –2 కింద రూ.1.80 కోట్ల అంచనాతో 46 పనులను, నంద్యాల జిల్లాలో రూ.3.80 కోట్ల అంచనాతో 85 పనులను గుర్తించారు. ఈ పనులకు 2025 ఏప్రిల్ 17వ తేదీన పాలనా అనుమతులు లభించాయి. అలాగే ఫేజ్ – 3 కింద నంద్యాల జిల్లాలో రూ.1.60 కోట్ల అంచనాతో 29 పనులను గుర్తించారు. ఈ పనులకు ఈ ఏడాది జనవరి 19వ తేదీన పాలనా అనుమతులు లభించాయి. ఫేజ్ 2, 3లో పాలనా అనుమతులు లభించిన పనులకు ప్రస్తుతం రూ.6 కోట్లు మంజూరయ్యాయి. అయితే ...ఇప్పుడు రోడ్ల పనులను మినహాయించి మిగిలిన అన్ని పనులకు మళ్లీ కొత్తగా అంచనాలు రూపొందించి పాలనా అనుమతులు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా పీఎం – అజయ్ పనుల్లో తీవ్ర జాప్యం జరుగనుంది.


