వీబీఆర్ వద్ద సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్న క్రైస్తవులు
దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని.. రైతులు సాగు చేసిన పంటలు బాగా పండాలని కోరుతూ వెలుగోడులో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్థానిక డిగ్రీ కళాశాల సమీపంలో రిజర్వాయర్కు ఆనుకుని ఉన్న మైదానంలో వందలాది మంది క్రైస్తవులు సమావేశమై సామూహిక ప్రార్థనలు చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్ద సంఖ్యలో పాల్గొని దేవుడిని ప్రార్థించారు. వర్షాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులకు సకాలంలో వానలు ఎంతో అవసరమని, వర్షాభావంతో పంటలకు నష్టం వాటిల్లకుండా దేవుడు కరుణించాలని ప్రార్థనల్లో వేడుకున్నారు. చెరువులు, కుంటలు, జలాశయాలు నీటితో నిండి భూగర్భ జలాలు పెరగాలని, పాడిపంటలతో ప్రజలు సంతోషంగా జీవించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఏబీఎం ఫీల్డ్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు బాలరాజు మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులు తొలగి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థించామన్నారు. కార్యక్రమంలో రాజేష్, మధు, విక్టర్, ప్రసాద్, నాగన్న, విజయ్ తదితరులు పాల్గొన్నారు. – వెలుగోడు


