గోనెగండ్ల: ఎండ తీవ్రత ఉదయం 7 నుంచే ప్రారంభమై సాయంత్రం 5 గంటలైనా తగ్గడం లేదు. దీంతో ప్రజలు ఆరు బయటకు రావడానికి భయపడుతున్నారు. ఆదివారం గోనెగండ్లలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రధాన రహదారులు, వీధులు నిర్మానుష్యంగా మారిపోయాయి. ఏప్రిల్ నెలలోనే ఈ విధంగా ఎండలు మండిపోతుంటే మే నెలలో తీవ్రత ఎంత ఉంటుందో అని జనం ఆందోళన చెందుతున్నారు.
భానుడి భగభగలు
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లాపై భానుడు విశ్వరూపం చూపుతున్నారు. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మే నెలలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెల మొదటి పక్షంలోనే నమోదు అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నంద్యాల రూరల్లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆళ్లగడ్డలో 42.7, బనగానపల్లెలో 42.3, గూడూరులో 42.1, కర్నూలులో 42.1, మంత్రాలయంలో 42. కౌతాళంలో 42.0 డిగ్రీల ప్రకారం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పుల తీవ్రత పెరుగుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.


