కారు చౌకగా రూ.7.20 కోట్లు
చెర వీడని గార్గేయపురం చెరువు
కర్నూలు–విజయవాడ జాతీయ రహదారిని అనుకొని ఉన్న భూములకు మంచి డిమాండ్ ఉంది. ఎకరా కనీసం రూ.2 కోట్లు పలుకుతోంది. ఈ లెక్కన విష్ణువర్ధన్రెడ్డి మనువళ్ల పేరిట ఆక్రమించుకున్న భూముల విలువ దాదాపు 7.20 కోట్ల పైనే. రెండేళ్ల క్రితమే చెరువు స్థలాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని పదుల సంఖ్యలో జేసీబీలు, టిప్పర్లు పెట్టి పూడ్చివేత పనులు చేపట్టారు. ఇందుకోసం సమీపంలోని కొండలు, గుట్టలను తవ్వి చెరువులో అక్రమంగా ఎర్రమట్టి నింపేశారు.
ప్రధాన రహదారిని ఆనుకుని నామరూపాలు కోల్పోతున్న చెరువు
సాక్షి టాస్క్ఫోర్స్: కోడుమూరు సీనియర్ టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి భూదాహానికి గార్గేయపురం చెరువు బలైపోతోంది. రెండేళ్ల క్రితం చెరువులో తన మనవళ్ల పేరుతో భూమి ఉందని చెప్పి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. సగానికిపైగా చెరువును పూడ్చి వేయించారు. ఆ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించడంతో అప్పటి ఆర్డీఓ హరిప్రసాద్, తహసీల్దార్ ఆర్.శివరాముడు చెరువు పూడ్చివేత పనులను నిలుపుదల చేయించారు. చెరువులో ఎవరికీ భూమి ఉండదని, కేవలం నీళ్లు లేని సమయంలో మాత్రమే సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఆక్రమణను పూడ్చి యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించారు. అప్పట్లో ఆయన ఈ ఆదేశాలను పెడచెవిన పెట్టారు. ప్రస్తుతం షాడో ఎమ్మెల్యేగా అధికారం చెలాయిస్తుండడంతో తిరిగి చెరువును చెరబట్టారు. ఆ రోడ్డులో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరూ ఎంత అధికార పార్టీ నాయకుడైతే చెరువును నామరూపాల్లేకుండా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే అధికారులు తాము ఏమీ చేయలేమన్నట్లు నిత్యం ఆ రోడ్డులో రాకపోకలు సాగిస్తున్నా కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
అనుభవందారుల నుంచి
కథ నడిపిన విష్ణు
కర్నూలు రూరల్ మండలం రుద్రవరం, నందనపల్లె రెవెన్యూ గ్రామాల పరిధి 214/2, 609, 661, 672, 704 సర్వే నంబర్లలో గార్గేయపురం చెరువు విస్తరించింది. దీనికి అనుకుని 673–1ఏ1.15 ఎకరాలు, 673–1బీలో 1.15 ఎకరాలు, 673/2లో 1.39 ఎకరాలు, 673/3లో 2.26 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 673–1ఏలో గద్ద దానమ్మ, 673–1బీలో గద్ద నత్తానియేల్, 673/2లో మంగళ శ్రీనివాసులు, ఎం.తిరుపాలయ్య, 673/3లో కె.పాపమ్మలు చెరువుకు నీళ్లు రాని సమయాల్లో కళింగర, పుచ్చకాయ, కర్బూజ వంటి పంటలను వేసుకొని జీవనం సాగిస్తుండటంతో అనుభవం దారులుగా గుర్తించారు. వీరికి రెవెన్యూ అధికారులు అప్పట్లో పట్టాదారు పాసుపుస్తకాలను ఇచ్చారు. అయితే వీరు కేవలం అనుభవందారులే. అమ్ముకోవడానికి ఎలాంటి హక్కులు ఉండవు. ఈ క్రమంలో అనుభవం దారుల నుంచి ఆ భూములను సులభంగా కొట్టేసేందుకు టీడీపీ నేత విష్ణువర్ధన్రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వెంటనే తన బినామీ, సుంకేసులకు చెందిన రేపల్లె సుధాకర్ను రంగంలోకి తీసుకొచ్చాడు. సర్వే నంబర్లు 673/2లో అనుభవం ఉన్న మంగళి శ్రీనివాసులు, ఎం.తిరుపాలయ్య ఆధీనంలోని 1.3 ఎకరాలను రేపల్లె సుధాకర్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 673–1ఏ, 1బీలలో అనుభవంలో గద్ద దానమ్మ, గద్ద సత్తానియేల్ ఆధీనంలోని 2.30 ఎకరాలు కూడా రేపల్లె సుధాకర్ పేరిట రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. రేపల్లె సుధాకర్ నుంచి 373–2లోని 1.3 ఎకరాలను తన మనువడు సూర్యవర్ధన్రెడ్డి(మైనర్), ఇతని తల్లి పులకుర్తి సౌజన్యను గార్డియన్గా పెట్టి రిజిస్ట్రేషన్ చేశారు. అలాగే 373–1ఏ, 1బీలలోని 2.30 ఎకరాలను తన మరో మనువడు ఆదిత్యవర్ధన్రెడ్డి(మైనర్)కి అతని తల్లి పులకుర్తి సౌజన్యను గార్డియన్గా రిజిస్ట్రేషన్ చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
గతాన్ని మరచిన విష్ణుకుటుంబం
కోడుమూరు టీడీపీ నేత ఎదురూరు విష్ణువర్ధన్రెడ్డి కుటుంబం గతాన్ని మరచి గార్గేయపురం చెరువును ఆక్రమణలోకి తెచ్చుకోవాలని చూస్తోందనే చర్చ జరుగుతోంది.
గతంలో నియోజకవర్గంలోని పలు చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయని స్వయంగా విష్ణువర్ధన్రెడ్డి, బతికి ఉన్న సమయంలో ఆయన కుమారుడు రాజావిష్ణువర్ధన్రెడ్డి గగ్గోలు పెట్టారు.
అయితే వారు మాత్రం గార్గేయపురం చెరువును అడ్డంగా ఆక్రమించుకోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గూడూరు మండలం నాగులాపురం చెరువుకు సమీపంలోని భూములను కొందరు ఆక్రమించారని స్థానికులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు స్వయంగా విష్ణువర్ధన్రెడ్డి మద్దతు తెలిపారు.
అలాగే విష్ణువర్ధన్రెడ్డి కుమారుడు రాజావర్ధన్రెడ్డి బతికున్న సమయంలో బి.తాండ్రపాడు చెరువు ఆక్రమణకు గురవుతోందని ఏకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఆ కేసు ఇప్పటికీ ట్రిబ్యునల్లో నడుస్తోంది.
అదే కుటుంబం ఐదు గ్రామాల రైతులకు సాగు, తాగునీటిని అందించే గార్గేయపురం చెరువు రూపురేఖలు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పూనుకోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది.
నీళ్లు లేని సమయంలో
సాగుకు అనుమతి
అనుభవం ముసుగులో రిజిస్ట్రేషన్లు
ఎకరం రూ.2 కోట్ల విలువ చేసే
3.60 ఎకరాల చెరువు భూమి కబ్జా
రెండేళ్ల క్రితం ‘సాక్షి’ కథనంతో
అడ్డుకున్న అధికారులు
అధికార పార్టీ నేత కావడంతో
తిరిగి చెరువు పూడ్చివేత
కారు చౌకగా రూ.7.20 కోట్లు


