తుంగభద్ర నదిని కాపాడుకుందాం
మంత్రాలయం రూరల్: కలుషితం కాకుండా తుంగభద్ర నదిని కాపాడుకుందామని బసవరాజ్ పాటిల్ అన్నారు. జల జాగృతి యాత్ర డిసెంబర్ 27న గంగావతి దగ్గర కిష్కంద దగ్గర నుంచి ప్రారంభమై ఆదివారం మంత్రాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగ ఆనిర్మల తుంగభద్ర అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీమఠం పీఠాధిపతి సుభుదేంద్రస్వామికి, మంత్రాయం ఎమ్మెల్యేకు బాలనాగిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆనంద్మల్లిగౌడ మాట్లాడుతూ.. తుంగభద్ర నది రక్షణే మన లక్ష్యం, భావితరాల క్షేమం అన్నారు. డాక్టర్ శివకుమార్ పాటిల్, లలిత రాణి బొల్లిశెట్టి సత్యనారాయణ, బసవరాజు పాటిల్, జగన్నాథ్, చల్లా వరుణ్, పర్యావరణ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.
నేర ప్రవృత్తి వీడకపోతే కఠిన చర్యలు
● రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక
కర్నూలు: నేర ప్రవృత్తి వీడకపోతే కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని రౌడీషీటర్లను పోలీసులు హెచ్చరించారు. డీఐజీ, ఇన్చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్న వారికి ఆదివారం పోలీసు స్టేషన్ల వారీగా కౌన్సిలింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘతం కలిగిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు. నేర ప్రవృత్తికి స్వస్తి పలికి సత్ప్రవర్తనతో మెరుగైన జీవితాన్ని గడపాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పనిసనిగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్టేషన్వారిగా పోలీసులు హెచ్చరించారు.
కలెక్టర్, జేసీలకు లగ్జరీ కార్లు
కర్నూలు(సెంట్రల్): కలెక్టర్, జేసీల కాన్వాయ్ కోసం రెండు లగ్జరీ కార్లను కొనుగోలు చేశారు. ఆదివారమే ఆ కార్లను అదనపు ఫిట్టింగ్లతో షోరూమ్ నుంచి డెలివరీ చేసుకున్నారు. ఒక్కో కారు విలువ రూ.60 లక్షలు. రెండు కార్లకు కలిపి రూ.1.20 కోట్లతో కొనుగోలు చేశారు. కాగా, ఈ కార్ల కొనుగోలుకు వినియోగించిన ఫండ్ వివరాలు తెలియలేదు.
నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులను సమర్పించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవడం కోసం కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు.
ఆదోని జిల్లా కోసం పాదయాత్ర
ఆదోని టౌన్: ఆదోని జిల్లా అయ్యేంతవరకు ఉద్యమం చేస్తామని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. వీరు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో 50 రోజులు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదోనిలోని రీలే దీక్షల శిబిరం నుంచి ఇస్వీ గ్రామం వద్ద నారా లోకేష్ యువగళం పాదయాత్ర వెయ్యి కి.మీ. స్మారక స్థూపం వద్దకు 300 మంది పాదయాత్ర చేపట్టారు. ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థూపానికి వినతి పత్రం అందించారు. జేఏసీ నాయకులు రఘురామయ్య, అశోకానందరెడ్డి, నూర్అహ్మద్, కృష్ణమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తుంగభద్ర నదిని కాపాడుకుందాం
తుంగభద్ర నదిని కాపాడుకుందాం


