
శ్రీశైలంలో భక్తుల సందడి
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామున్నే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం చేసుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్ని కిటకిటలాడాయి.
సమస్యల పరిష్కారానికి కృషి
కర్నూలు(సెంట్రల్): న్యాయశాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేస్తానని కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం కర్నూలు జిల్లా జ్యూడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేంద్రగౌడ్, జనరల్ సెక్రటరీ గోపాల్ ఆధ్వర్యంలో పలువురు ఉద్యోగులు కలెక్టర్ను ఆయన చాంబరులో మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయశాఖ ఉద్యోగులకు అన్ని వేళల సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ తెలిపినట్లు వారు వివరించారు. ట్రెజరర్ శివరాముడు, సలహాదారు రాముడు, కార్యదర్శులు రాఘవరెడ్డి, రమేష్, సభ్యుడు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
ప్రశాంతంగా ‘గురుకుల’ పరీక్ష
ఆదోని సెంట్రల్: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిరావ్ పూలే గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్ష ఆది వారం ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 2,497 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 2,273 మంది పరీక్ష రాసినట్లు జిల్లా కో అర్డినేటర్ య మునాదేవి తెలిపారు. ఆదోని డివిజన్ పరిధిలో ఏడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.
హ్యాండ్బాల్ చాంపియన్ ‘కర్నూలు’
కర్నూలు (టౌన్)/ కదిరి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణం ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండు రోజులుగా జరిగిన 54వ రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో కర్నూలు జట్టు చాంపియన్షిప్ను కై వసం చేసుకుంది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. ఆదివారం టోర్నీ ముగిసింది. ప్రథమ స్థానం కర్నూలు, ద్వితీయ స్థానం పశ్చిమగోదావరి, తృతీయ స్థానంలో శ్రీసత్యసాయి జిల్లా జట్లు నిలిచాయి. విజేత జట్టుకు సీనియర్ హ్యాండ్బాల్ క్రీడాకారుడు ప్రసాద్ ట్రోఫీని ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మహేష్తో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
‘వేదావతి’లో ఇసుక దోపిడీ
హొళగుంద: వేదావతి(హగరి) నుంచి అక్రమార్కులు యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారు. దీంతో నదిలో రాళ్లు, రప్పలు కనిపిస్తున్నాయి. హొళగుంద మండల పరిధిలోని మార్లమడికి వద్ద ఈ దుస్థితి నెలకొంది. ఉచితంగా ఇసుక తీసుకునేందుకు అనుమతి ఉంది. అయితే నిబంధనలను పాటించడం లేదు. దీంతో వేదావతి నది నుంచి అక్రమంగా ఇసుకను పట్టణాలకు తరలిస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు ఇంకి పోయి నదిలో రాళ్లు తేలాయి. ఈ నదిలోనే ముందుకు వెళితే కర్ణాటక రాష్ట్రంలోని రారావి వద్ద ఇసుక మేటలు కనిపిస్తాయి.

శ్రీశైలంలో భక్తుల సందడి

శ్రీశైలంలో భక్తుల సందడి

శ్రీశైలంలో భక్తుల సందడి