
మాజీ ఎంపీటీసీ సభ్యుడిపై దాడి
బండి ఆత్మకూరు: కడమల కాలువ గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడుపై అదే గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ సుబ్బరాయుడు దాడికి పాల్పడ్డాడు. బాధితుని వివరాల మేరకు.. గ్రామంలో ప్రస్తుతం రీ సర్వే జరుగుతోంది. అయితే సుబ్బరాయుడికి చెందిన 1.50 ఎకరాల భూమిని భాస్కర్ గతంలో కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ పొలాన్ని సాగు చేసుకుంటున్నాడు. పాస్ బుక్కులు కూడా ఉన్నాయి. అయితే ఆన్లైన్లో సుబ్బరాయుడి తండ్రి పేరు ఉందని ఆక్రమించే ప్రయత్నం చేయడంతో రెవెన్యూ అధికారులు భాస్కర్కు చెందుతుందని తేల్చారు. అయితే పొలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకున్న భాస్కర్ శనివారం సచివాలయం వద్దకు వెళ్లాడు. కాగా అక్కడే సుబ్బరాయుడు అతనిపై దాడి చేయడం గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఇద్దరి వ్యక్తులపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్ మోహన్ తెలిపారు.
14వేల హెక్టార్లకు
సూక్ష్మ సేద్యం
కర్నూలు(అగ్రికల్చర్): 2025–26వ సంవత్సరానికి సూక్ష్మ సేద్యం లక్ష్యాలు ఖరారయ్యాయి. మొదట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాకు 14వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించే విధంగా లక్ష్యాలను ఇచ్చింది. కర్నూలు జిల్లాలో 7 వేలు, నంద్యాల జిల్లాలో 7 వేల హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. 2024–25 సంవత్సరంలో కర్నూలు జిల్లాలో 5,653 హెక్టార్లకు, నంద్యాల జిల్లాలో 5,058 హెక్టార్లకు సూక్ష్మ సేద్యం కల్పించినట్లు స్పష్టమవుతోంది. గత ఏడాది సాధించిన ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాదికి లక్ష్యాలను ఇచ్చినట్లుగా అధికార వర్గలు తెలిపాయి. ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. ఒక రైతుకు గరిష్టంగా రూ.2.18 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా 33 శాతం ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం 67 శాతం భరిస్తుంది. ఇతర సన్న, చిన్నకారు రైతులకు ఐదు ఎకరాల వరకు 90 శాతం సబ్సిడీపై సూక్ష్మ సేద్యం కల్పిస్తారు. రైతులు 10 శాతం భరించాలి. సబ్సిడీ రూ.2.18 లక్షలు లభిస్తుంది. కేంద్రం 33 శాతం, రాష్ట్రం 57 శాతం భరిస్తాయి. స్ప్రింక్లర్లు 50 శాతం సబ్సిడీపై ఇవ్వనున్నారు.
బెల్టు షాపులపై ఎకై ్సజ్ దాడులు
కర్నూలు: లైసెన్స్ దుకాణాల నుంచి మద్యం తరలించి గ్రామీణ ప్రాంతాల్లో బెల్టు షాపుల ద్వారా అధిక లాభాలకు విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఎకై ్సజ్ అధికారులు దాడులు చేశారు. ఎన్ఫోర్స్మెంట్ సీఐ జయరాముడు, ఎస్ఐ రవితేజ, ఎకై ్సజ్ స్టేషన్ ఎస్ఐలు రెహనా, నవీన్, సిబ్బంది నందీశ్వర్ రెడ్డి, చంద్రపాల్, ఈరన్న, రామలింగయ్య తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలు మండలంలోని వివిధ గ్రామాల్లో తనిఖీ నిర్వహించారు. లక్ష్మీపురంలో ఎరుకలి నరసింహులు, పుసులూరులో బోయ అయ్యస్వాములు బెల్టు షాపులు నడుపుతున్నట్లు గుర్తించి తనిఖీ నిర్వహించారు. 22 మద్యం బాటిళ్లను వారి నుంచి స్వాధీనం చేసుకుని ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా బంగారుపేటలో నాటుసారా స్థావరంపై దాడులు చేసి 25 లీటర్ల నాటుసారా, వెయ్యి లీటర్లు సారా తయారీకి ఉపయోగించే ఊటను ధ్వంసం చేశారు. సారా విక్రయిస్తున్న నీలిషికారి మహాలిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

మాజీ ఎంపీటీసీ సభ్యుడిపై దాడి