‘జగనన్నకు చెబుదాం’లో 1,161 అర్జీలకు పరిష్కారం
కర్నూలు కల్చరల్: జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంబంధించి మే 9 నుంచి ఇప్పటివరకు 2,099 గ్రీవెన్స్ రిజిస్టర్ కాగా 1,161 అర్జీలు పరిష్కారమయ్యాయని కర్నూలు జిల్లా స్పెషల్ ఆఫీసర్, రవాణా, రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ పీఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జగనన్నకు చెబుదాం అంశంపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజనతో కలసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలు చేస్తోందన్నారు. పంచాయతీరాజ్, సర్వే, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్, హౌసింగ్, ఆర్అండ్బీ, జీఎస్డబ్ల్యూఎస్ శాఖలలో రీ ఓపెన్ ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎండార్స్మెంట్లు సక్రమంగా ఇవ్వకపోవడం రీ ఓపెన్ కావడానికి కారణమని పేర్కొన్నారు. నాణ్యతతో కూడిన ఎండార్స్మెంట్లు అప్లోడ్ చేయాలని సూచించారు. సచివాలయం పరిధిలో ఉన్న సిబ్బంది ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్పందన నిర్వహిస్తున్నారో లేదో అని పర్యవేక్షణ చేయాలని జిల్లాపరిషత్ సీఈఓని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలు రీ ఓపెన్ ఎందుకు అవుతున్నాయి అనే అంశం మీద దృష్టి సారించామన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ భార్గవతేజ, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర చెక్పోస్టు తనిఖీ
కర్నూలు: పంచలింగాల క్రాస్ సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న ఆర్టీఓ అంతర్రాష్ట్ర చెక్పోస్టును జిల్లా స్పెషల్ ఆఫీసర్ ప్రద్యుమ్న శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులన్నీ సక్రమంగా ఉండటంతో రవాణా శాఖ అధికారులను అభినందించారు. ఆయన వెంట డీటీసీ శ్రీధర్, ఆర్టీఓ రమేష్, ఎంవీఐలు నాగరాజు నాయక్, మల్లికార్జున, మనోహర్రెడ్డి, సునిల్ కుమార్ ఉన్నారు.
కర్నూలు జిల్లా స్పెషల్ ఆఫీసర్, రవాణా,
రోడ్లు, భవనాల శాఖ సెక్రటరీ
పీఎస్ ప్రద్యుమ్న