మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో ఏర్పాటు చేయనున్న ఆర్టిీఫిషి యల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ల్యాబ్ల్లో పని చేసేందుకు కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కనకారావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరం, భీమవరం, ఏలూరు, విజయవాడల్లో ఏఐ ల్యాబ్స్ను ఏర్పాటు చేయనున్నామని వివరించారు. డేటా యన్నోటేటర్ అసిస్టెంట్–5, డేటా క్యూరేటర్ అసిస్టెంట్–5, కంప్యూటర్ లాబ్ అసిస్టెంట్–10 పోస్టులను భర్తీ చేస్తారని తెలియజేశారు. పూర్తి వివరాలకు జీవోవీఐటీఐకాకినాడ.వోఆర్జీ వెబ్సైట్ను పరిశీలించాల్సిందిగా ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. వివరాలకు 99484 20477 నంబర్లో సంప్రదించాల్సిందిగా కోరారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు జరిగే దసరా ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు కృషి చేయాలని జిల్లా అధికారులు సూచించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం దుర్గగుడి ఆవరణలోని మహా మండపం నాలుగో అంతస్తులోని నూతన సమావేశ మందిరంలో సమీక్ష జరిగింది.ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, కలెక్టర్ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, జేసీ ఇలక్కియ, కమిటీ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనానాయక్ పాలక మండలి సభ్యులు, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
సమగ్ర ప్రణాళిక
అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులు మీడియాతో మాట్లాడారు. దర్శనం, రద్దీ నియంత్రణ, పార్కింగ్, తాగునీరు, మరుగుదోడ్లు, ప్రసాదం, భక్తుల భద్రతపై సమగ్ర ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రద్దీకి అనుగుణంగా పిల్లలకు పాలు, బిస్కెట్లు, అన్నప్రసాదం, ఉచిత ప్రసాద పంపిణీ చేయాలన్నారు. ఉత్సవాల్లో పోలీసు సిబ్బందిని 20 శాతం మేర తగ్గించి ఆధునిక సాంకేతిక విధానాన్ని అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. 4డీ డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేయనున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది దసరా వాటర్ బాటిల్స్ స్థానంలో బబూల్స్తో తాగునీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. గతేడాది దసరా, భవానీ దీక్షల సమయంలో కార్పొరేషన్కు దేవస్థానం చెల్లించాల్సిన బిల్లుల పెండింగ్ ఉండటంతో సమావేశంలో వాడిగా వేడిగా చర్చ జరిగింది.


