అవనిగడ్డ: గతంలో ఎన్నడూ లేని దుర్భర పరిస్థితులను దివిసీమ రైతులు ఎదుర్కొంటున్నారు. ఎంతో కష్టపడి పోసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల్లో 48,298 ఎకరాల్లో వరిసాగు ఆయకట్టు ఉంది. ప్రతి సంవత్సరం ఈ సమయానికి సుమారు 70 శాతం నాట్లు పూర్తయ్యేయి. ప్రస్తుతం 5,575 ఎకరాల్లో అంటే కేవలం 11 శాతం మాత్రమే నాట్లు వేశారు. మిగిలిన వాటికి చుక్క నీరు చేరకపోవడంతో దాదాపు 40వేల ఎకరాల్లో నాట్లు వేసే పరిస్థితి లేదు. పోసిన నారుమళ్లు కూడా నీరందక ఎండిపోయి చనిపోతున్నాయి. కొన్నిచోట్ల నెలరోజుల క్రితం పోసిన నారుమళ్లు ఎదుగుదల లేక కుంగిపోతున్నాయి. ఇక ముందు వర్షాలు పడినా, పంటకాలువకు నీరువచ్చినా ఈ నారుమళ్లు ఉపయోగపడవని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దివిసీమ చరిత్రలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదని అశ్వరావుపాలెంకు చెందిన రైతు నాగేశ్వరరావు వాపోయారు.


