నందిగామ రూరల్: పట్టణంలోని రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలోని శుకశ్యామలాంబ అమ్మవారికి దాతల తరఫున పట్టణానికి చెందిన చలపాటి పూర్ణచంద్రరావు, స్వరాజ్య లక్ష్మీ దంపతులు రూ. 10లక్షల విలువ చేసే 73 గ్రాముల గజలక్ష్మీ మాత ప్రతిమతో కూడిన వడ్డాణాన్ని శుక్రవారం విరాళంగా అందజేశారని ఈవో సురేష్ తెలిపారు. విజయవాడకు చెందిన నీలేశ్వరరావు, రాజకుమారి, రవి, సుధారాణి దంపతుల సౌజన్యంతో వడ్డాణాన్ని అందించినట్లు తెలిపారు. దాతలు సమర్పించిన వడ్డాణానికి సంప్రోక్షణ అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారికి అలంకరించారు. దాతలకు ప్రత్యేక పూజల అనంతరం స్వామి వారి శేషవస్త్రం, ప్రసాదాలు అందజేశారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త మురళీరాఘవ కుమార్, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


