శ్రావణమాసం శుభప్రదమైనది
పెనుగంచిప్రోలు/కంచికచర్ల: పన్నెండు తెలుగు నెలల్లో శ్రావణమాసం ఎంతో విశిష్టమైనది. సకల శుభాలకు ఆలవాలమైన మాసం ఈనెల 13న ఆరంభం కానుంది. దీంతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, పవిత్రోత్సవాలు, కృష్ణాష్టమి వేడుకలకు ఆలయాల్లో అధికారులు, కమిటీల సభ్యులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
శుభప్రదమైన మాసం..
ఈ మాసం ధార్మిక, ఆధ్మాత్మిక, వ్యాపార ప్రారంభం వంటి శుభకార్యాలతో ముడిపడి ఉంటుంది. వివాహం, గృహ ప్రవేశం, గృహ నిర్మాణం, నామకరణం వంటి అనేక శుభ కార్యాలు నిర్వహించటానికి మంచి నెల. కొత్త దంపతులు ఆషాఢంలో ఎడబాటుకు గురవుతారు. శ్రావణంలో కలుస్తారు. మహిళలు వ్రతాలు, లక్ష్మీదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు. నిండు నూరేళ్లు సౌభాగ్యంగా ఉండాలని, మంచి సంతానం కలగాలని, నవ వధువులు మంగళ గౌరీ వ్రతాలు మంగళవారాలు ఆచరిస్తారు. కొత్తగా పెళ్లయిన యువతులు మంగళ గౌరీ వ్రతాలు, పేరంటాలతో సందడి చేస్తారు. ఈమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఒక విశిష్టత ఉంటుంది. నెల రోజులుగా ఆషాఢ మాసంలో ముహూర్తాలు లేవు. శ్రావణమాసం ప్రారంభం కానుండటంతో మహిళలు లక్ష్మీవ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.
భక్తి పారవశ్యం..
చాంద్రమానం ప్రకారం శ్రావణాన్ని ఐదో నెలగా పరిగణిస్తారు. ఈనెల పౌర్ణమిన చంద్రుడు శ్రవణ నక్షత్ర సమీపంలో సంచరిస్తున్నందున శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రం మహావిష్ణువు జన్మ నక్షత్రం కావటంతో విష్ణుపూజలకు ప్రసిద్ధి.
మంగళ, శుక్ర, శనివారాలను అత్యంత పుణ్యప్రదమైనవిగా భావిస్తారు. మంగళవారం గౌరీ పూజలు, శుక్రవారాల్లో లక్ష్మీపూజలు, శనివారాల్లో విష్ణు పూజలు చేస్తారు.
పండుగలు ఇలా..
14న తొలి శుక్రవారం, 21న రెండో శుక్రవారం, 28న మూడో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం, రాఖీ పండుగ, అదే రోజు జంధ్యాల పౌర్ణమి, సెప్టెంబర్ 4న నాల్గో శుక్రవారం, ఇదే నెలలో శ్రీకృష్ణాష్టమి వంటి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. సెప్టెంబర్ 11న శుక్రవారంతో మాసం ముగుస్తుంది.
శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విశేష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శీనానాయక్ పేర్కొన్నారు. ప్రతి నిత్యం ఏడు గంటలకు లక్ష కుంకుమార్చన, శ్రీచక్రనవార్చనలు జరుగుతాయన్నారు. అమ్మవారికి ప్రీతికరమైన కుంకు మార్చనను భక్తులు శ్రావణ మాసంలో విశేషంగా జరిపించుకుంటారని చెప్పారు. ఇందు కోసం ప్రతి రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ ఆర్జిత సేవా టికెట్ రూ. 1000 అని, టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందవచ్చని తెలిపారు. ఒక టికెట్పై ఇద్దరిని, లేదా దంపతులను అనుమతిస్తారని చెప్పారు. కుంకుమార్చన అనంతరం రూ.300టికెట్ క్యూలైన్లో అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు.
శ్రావణమాసం అంటే ఎంతో పవిత్రమైనదిగా, ప్రధానమైనదిగా భావిస్తారు. జ్ఞానసిద్ధి వరించే మాసంగా పురాణాల్లో పేర్కొన్నారు. శ్రావణం అంటే ఎంతో శుభం అని అర్థం. వైష్ణవారాధనతో పాటు మహా శివునికి పెద్ద ఎత్తున రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి.
– శివరాంభొట్ల ఆంజనేయశర్మ,
తిరుపతమ్మ ఆలయ పురోహితుడు


