చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిస్థితులు, ప్రజల జీవనోపాధి, అభివృద్ధి అవసరాలను సమన్వయం చేస్తూ కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యానికి ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్జెడ్)ను శాసీ్త్రయ ప్రాతిపదికన ఖరారు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ ఆయన చాంబర్లో కొల్లేరు వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో జిల్లాలోని గుడివాడ మండలంలోని 12 గ్రామాలు, బాపులపాడు మండలంలోని 5 గ్రామాలకు ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించే అంశంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
త్వరితగతిన చేయకుంటే ఇబ్బంది..
కలెక్టర్ మాట్లాడుతూ ఈఎస్జెడ్ను త్వరితగతిన ఖరారు చేయకపోతే ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం అభయారణ్యం సరిహద్దు నుంచి 10 కిలోమీటర్ల పరిధి డిఫాల్ట్ ఎకో సెన్సిటివ్ జోన్గా పరిగణించే అవకాశం ఉందన్నారు. కాబట్టి సంబంధిత శాఖలు సమగ్ర అధ్యయనంతో త్వరితగతిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏలూరు, భీమవరంలో రూపొందించిన ప్రతిపాదనలను కూడా పరిశీలించి అవసరమైన సూచనలు స్వీకరించాలని తెలిపారు. ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో అనుమతించదగిన, నియంత్రిత, నిషేధిత కార్యకలాపాలపై సమగ్ర అవగాహనతో శాఖల వారీగా తమ అభిప్రాయాలు, సూచనలు సిద్ధం చేసి తదుపరి సమావేశంలో సమర్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య మేనేజ్మెంట్ డీఎఫ్వో డాక్టర్ ఏ త్రిమూర్తులురెడ్డి, గుడివాడ ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, కృష్ణా డీఎఫ్వో సునీత, డీపీవో ఎం. ధనలక్ష్మి, మత్స శాఖాధికారి అయ్యా నాగరాజా, వ్యవసాయ శాఖ జేడీ జ్యోతి రమణి, సర్వే ఏడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ


