
కూలీలపై దూసుకెళ్లిన కారు
జగ్గయ్యపేట అర్బన్: చెరువుబజారులో కొత్త రైతుబజారు వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికుల అడ్డాలో పనులు కోసం వేచిచూస్తున్న పలువురు కూలీలపైకి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. దీంతో ఓర్సు రామకృష్ణ, తాళ్లూరి వాసు, బండి నాగరాజు, కుంచపు నాగరాజు, బత్తుల వెంకట గురువులు అనే ఐదుగురు కూలీలు గాయపడ్డారు. కారు వారిని ఢీకొన్న తర్వాత ఇనుప పోల్కు తగిలి ఆగిపోయింది. గాయపడిన వారిని స్థానికుల సాయంతో ప్రథమ చికిత్స కోసం జగ్గయ్యపేట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ వెంకటేశ్వర్లు కూడా చెరువు బజారు వాసే. కిరాయికి కారు నడుపుతుంటాడు. అతను ఆ సమయంలో పూటుగా మద్యం సేవించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించగా, ప్రథమ చికిత్స అనంతరం వారిని డిశ్చార్జ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్(తాతయ్య) వారిని పరామర్శించారు. ప్రమాద సంఘటనపై పోలీసులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పట్టణ ఎస్ఐ–2 వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐదుగురికి గాయాలు