
కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం
బంటుమిల్లి: మండల పరిధిలోని నారాయణపురం గ్రామ శివారులో 216 జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు టీవీ మెకానిక్లు దుర్మరణం చెందారు. ఎస్ఐ గణేష్కుమార్ కథనం మేరకు... మచిలీపట్నం పట్టణానికి చెందిన వాసాబత్తుల వీరాచారి (40), అనకాపల్లి శివప్రసాదు (40) ద్విచక్రవాహనంపై రాజమండ్రి వెళ్లి పనులు పూర్తి చేసుకుని మచిలీపట్నం తిరిగి వస్తుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం 6 గంటల సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారును స్వాధీనం చేసుకున్నారు.
ఉద్యోగం పేరుతో రూ. 22 లక్షలు స్వాహా
పెనమలూరు: ఉద్యోగం పేరుతో మహిళ వద్ద రూ. 22 లక్షల సొమ్ము సైబర్ నేరగాళ్లు స్వాహా చేసిన ఘటనపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప గ్రామానికి చెందిన నూకల విజయశ్రీ ఉద్యోగం కోసం ప్రయత్నాల్లో ఉంది. ఆమె ఆన్లైన్లో రెంట్కామ్ అనే వెబ్సైట్లో చాట్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు ఆమెతో చాటింగ్ చేసి గ్రూప్లో చేర్చారు. ఆన్లైన్లో ఆమెకు టాస్కు ఇవ్వగా సకాలంలో పూర్తి చేసింది. దీంతో సైబర్ నేరగాళ్లు సొమ్ము పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని విజయశ్రీకి ఆశ చూపి నమ్మించారు. సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి ఈ నెల 5 నుంచి 7వ తేదీల్లో విజయశ్రీ పలు దఫాలుగా రూ. 22,09,857 ఆన్లైన్లో సొమ్ము ట్రాన్స్ఫర్ చేసింది. సొమ్ము బదిలీ అయిన తర్వాత గ్రూప్లో ఉన్న వ్యక్తులు స్పందించడం మానేశారు. దీంతో తాను మోసపోయానని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉరేసుకొని విద్యార్థిని ఆత్మహత్య
మంగొల్లు(వత్సవాయి): ఫ్యాన్కు ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఏలూరి నరసింహారావు, స్వాతి దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె అయిన ఏలూరి రాజ (14) జగ్గయ్యపేటలోని ఒక ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతుంది. తెల్లవారుజామున ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. తల్లి స్వాతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ పి.ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు.
అడవిలో వృద్ధుడి మృతదేహం గుర్తింపు
తిరువూరు:మండలంలోని లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో చెట్టుకు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని శనివారం పశువుల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల 8న చిట్టేల గ్రామానికి చెందిన పెరుమాళ్ళ ఆశీర్వాదం (72) కనిపించట్లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా శనివారం లక్ష్మీపురం అటవీ ప్రాంతంలో వృద్ధుడి మృతదేహం చెట్టుకు వేలాడుతున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. చెట్టుకు లుంగీతో వేలాడుతున్న మృతదేహాన్ని ఆశీర్వాదంగా కుటుంబసభ్యులు గుర్తించారని చెప్పారు. ఆయనది హత్యా, ఆత్మహత్యా అనే విషయమై విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. కుళ్లిపోయి అస్తిపంజరంగా మారిన మృతదేహానికి సంఘటనా స్థలంలోనే పంచనామా చేసి ఖననం చేసినట్లు వెల్లడించారు.