
కారు పల్టీకొట్టి నలుగురికి తీవ్ర గాయాలు
నున్న(విజయవాడరూరల్): వెస్ట్ బైపాస్ జాతీయ రహదారి నున్న గ్రామంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలకు గాయాలైన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతున్న కారు విజయవాడ వెస్ట్ నేషనల్ బైపాస్ రోడ్డులో నున్న స్లిప్వే వద్దకు వచ్చేసరికి కంట్రోల్ తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిమ్మను వేగంగా ఢీ కొట్టింది. కారు పల్టీకొట్టగా డ్రైవింగ్ చేస్తున్న పాము కాసుబాబు లోపల ఇరుక్కు పోయాడు. ఆయన భార్య శిరీషకు తీవ్రగాయాలయ్యాయి. ఇద్దరు మగ పిల్లలకు గాయాలు కాగా ఒక బాబుకి కుడి కాలు విరిగింది. హైవేపై వెళుతున్న ప్రయాణికులు,సెక్యూర్టీ సిబ్బంది హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి వెళ్లి కారులో ఇరుక్కుపోయిన వారిని బటయకు తీశారు. నేషనల్ హైవే అంబులెన్స్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాకినాడకు చెందిన పాము కాసుబాబు హైదరాబాద్ రెడ్డీస్ ల్యాబ్లో ఐటీ మేనేజర్ గా పని చేస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇద్దరు పిల్లలు భార్యతో కలిసి కారులో కాకినాడు వెళుతున్నారు. నేషనల్ హైవే పక్కన టవర్ నిర్మాణం పనులు నిమిత్తం రోడ్డుపై పనులు పూర్తి కాలేదు. రోడ్డు సగభాగంలో రబ్బీష్ కుప్పలు పోసి సింగిల్వే మూసివేసి ఉండటంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న నున్న పోలీసులు సంఘటన ప్రాంతానికి వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భార్యాభర్తతో పాటు
ఇద్దరు పిల్లలకు గాయాలు
హైదరాబాద్ నుంచి కాకినాడ వెళుతుండగా ఘటన