
వయోవృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు
చిలకలపూడి(మచిలీపట్నం): విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల కమిటీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని వయో వృద్ధులకు పోషణ, ట్రిబ్యునల్లో బ్యాంకు అకౌంట్ను ఓపెన్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూన్ 15న ప్రపంచ వయోవృద్ధుల వేధింపుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించాలన్నారు. కార్యక్రమంతో పాటు ప్రత్యేక మెడికల్ క్యాంపులు, ఉపకరణాల పంపిణీ చేయాలన్నారు. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామస్థాయిలో వారిని సన్మానించాలన్నారు.
బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు..
దివ్యాంగుల కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో సదరం చూసే ఉద్యోగిని తక్షణమే మొదటి అంతస్తు నుంచి కిందకు మార్చేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను కలెక్టర్ ఆదేశించారు. అన్ని బ్యాంకుల్లో దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. లిఫ్ట్, ర్యాంపులు నిర్మించాలన్నారు. ప్రతి కార్యాలయంలో దివ్యాంగుల కోసం గ్రీవెన్స్ ఆఫీసర్ను నియమించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ వెంకటనాయుడు, జెడ్పీ సీఈవో కె. కన్నమ్మనాయుడు, డీఎంఅండ్హెచ్వో ఎస్. శర్మిష్ట, ఆర్డీవో కె. స్వాతి, వికలాంగుల సంక్షేమశాఖ అధికారి రామరాజు తదితరులు పాల్గొన్నారు.
మాట్లాడుతున్న కలెక్టర్ బాలాజీ