బుడమేరు వరదలో పడి మరో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

బుడమేరు వరదలో పడి మరో మహిళ మృతి

Sep 25 2024 2:40 AM | Updated on Sep 25 2024 8:59 AM

-

సుమారు 20 రోజుల తర్వాత మృతదేహం లభ్యం

 ముళ్లచెట్ల మధ్య ఇరుక్కున్న వైనం

 పురుగులు తినేయడంతో బయటపడిన చేతి ఎముకలు

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): బుడమేరు వరద ముంపులో వ్యక్తులు మృతి చెందిన ఘటనలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ నెల ఒకటో తేదీన వరద ముంపులో కొట్టుకుపోయిన విజయవాడ న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన వ్యక్తి 15 రోజుల తర్వాత మరణించి కనిపించారు. ఇప్పుడు తాజాగా అదే తరహాలో సింగ్‌నగర్‌ ఇందిరానాయక్‌నగర్‌లోని ఐదో రోడ్డులో బుడమేరు వెంబడి ఉన్న ముళ్ల చెట్ల మధ్య ఓ మహిళ మృతదేహాన్ని అజిత్‌ సింగ్‌నగర్‌ పోలీసులు గుర్తించారు.

తీవ్ర దుర్వాసన
ఇందిరానాయక్‌నగర్‌ ఐదో రోడ్డులో ఉన్న బుడమేరు వెంబడి ప్రాంతం నుంచి రెండు రోజులుగా తీవ్ర దుర్వాసన వస్తోంది. స్థానికులు దీనిపై సింగ్‌నగర్‌ పోలీసులకు సమాచారమివ్వగా వారు సోమవారం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ మహిళ మృతి చెంది ఉన్నట్లుగా గుర్తించి ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి తీవ్రంగా శ్రమించారు. చనిపోయి సుమారు 20 రోజుల పైనే కావడంతో ఆమె రెండు చేతుల ఎముకలు బయటకు వచ్చేశాయి. తల భాగం పురుగులు తినివేయడంతో గుర్తు పట్టలేనంత దారుణంగా తయారైంది. మృతురాలి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని మృతదేహంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement