మహిళా సంఘాల సభ్యులకు ఈ– కేవైసీ ఆర్థిక, సంక్షేమ పథకాల అమలు మరింత సులభతరం జిల్లాలో ఇప్పటికీ 4.2 శాతమే ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పూర్తికి ఆదేశం
కెరమెరి: స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలు డిజిటల్ విధానంలో ధ్రువీకరించేందుకు మూడ్రోజుల క్రితం చేపట్టిన ఈ–కేవైసీ జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఽఆధార్ అనుసంధానం ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సంఘాల కార్యకలాపాలను మరింత పారదర్శకంగా నిర్వహించడంతో పాటు అర్హులైన సభ్యులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సకాలంలో అందించేందుకు ఈ–కేవైసీని కీలకంగా పరిగణిస్తున్నారు. సంఘాల్లోని సభ్యుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతా, ఇతర వివరాలు ధ్రువీకరించడం ద్వారా అందరికీ గుర్తింపు ఏర్పడుతుంది. దీంతో వివిధ రకాల ఆర్థిక, సంక్షేమ ప్రయోజనాలను అర్హులైన వారికి అందించడం సులభం కానుంది. ముఖ్యంగా సభ్యుల వివరాల్లో తప్పులు, ఒకే వ్యక్తి పేరుతో నమోదైన వివరాలు, పాత సమాచారం తదితర సమస్యలు గుర్తించి సరిచేసేందుకు ఈ ప్రక్రియ ఎంతో దోహద పడుతుంది.
రుణాల ప్రక్రియలోనూ కీలకమే..
స్వయం సహాయక సంఘాల బలోపేతంలో బ్యాంక్ రుణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. సంఘాల పొదుపులు, బ్యాంక్ లావాదేవీలు, రుణాల మంజూరు, తిరిగి చెల్లింపులు లాంటి అంశాల్లో సభ్యుల వివరాలు సరిగా ఉండడం అవసరం. ఈ–కేవైసీ పూర్తయితే సభ్యుల గుర్తింపు స్పష్టంగా ఉండనుండడంతో బ్యాంకింగ్ ప్రక్రియలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు తగ్గే అవకాశముంది. మహిళలు స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవసరమైన ఆర్థిక లావాదేవీల సహకారం పొందడంలోనూ ఇది ఎంతో ఉపయోగపడనుంది. ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారత కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాలు సంఘాల ద్వారా మహిళలకు చేరుతున్నాయి. ఈ–కేవైసీ ద్వారా సభ్యుల వివరాలు ధ్రువీకరిస్తే అర్హులైన సభ్యులను గుర్తించడం, వారి వివరాలు డిజిటల్ రికార్డుల్లో భద్రపర్చడం సులభమవుతుంది. ఫలితంగా భవిష్యత్లో ప్రయోజనాలు మరింత పారదర్శకంగా, తప్పనిసరిగా అందించే అవకాశముంది.
సంఘాల నిర్వహణలో పారదర్శకత
గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు రుణాలు, చిన్నతరహా వ్యాపారులు, ఉపాధి కార్యక్రమాల నిర్వహణలో సంఘాలు కీలకంగా ఉన్నాయి. వేలాది మంది మహిళలు సంఘాల ద్వారా ఆర్థిక కార్యకలాపాల్లో భాగస్వాములవుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రతీ సభ్యురాలి వివరాలు కచ్చితంగా ఉండడం అత్యవసరం. ఈ–కేవైసీ పూర్తయితే సంఘాల సభ్యుల వివరాలు క్రమబద్ధీకరించడంతో పాటు భవిష్యత్లో డిజిటల్ విధానంలో సేవలు అందించేందుకు మార్గం సుగమమవుతుంది. జిల్లాలో ఆదివారం వరకు 4.2 శాతమే ప్రక్రియ పూర్తి కాగా, మిగతా సభ్యుల నమోదును వేగవంతం చేయాల్సిన అవసరముంది. జిల్లాలోని కెరమెరి, జైనూర్, తిర్యాణి, సిర్పూర్(యు), లింగాపూర్, వాంకిడితోపాటు కాగజ్నగర్ డివిజన్లోని కొన్ని మండలాల్లోని గ్రామాలు నెట్వర్క్కు దూరంగా ఉన్నందున ఈ ప్రక్రియ ముందుకుసాగడం లేదు. ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని ఐకేపీ సిబ్బందిని జిల్లా అధికారులు ఆదేశించారు.
జిల్లా వివరాలు
మహిళా సాధికారతకు మరో అడుగు
స్వయం సహాయక సంఘాలు పొదుపు సంఘాలుగానే కాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన కు వేదికలుగా మారుతున్నాయి. సంఘాల ద్వారా పొదుపు అలవాటు, బ్యాంకింగ్ పరిజ్ఞా నం, స్వయం ఉపాధి, చిన్న వ్యాపారాలు తదిత ర కార్యక్రమాల్లో మహిళలు ముందుకువస్తున్నా రు. ఈ నేపథ్యంలో డిజిటల్ వివరాల ధ్రువీకరణ భవిష్యత్ సేవలకు పునాదిగా నిలువనుంది. ఈ–కేవైసీ ప్రక్రియ వేగంగా పూర్తిచేసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్ సేవలు, జీవనోపాధి అవకాశాలు సులభంగా అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.


