ఆసిఫాబాద్: పెద్దపల్లి జిల్లా సుందిళ్ల శ్రీలక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఆదివారం సామూహిక నరసింహ శతక పారాయణం చేశారు. ఆసిఫాబాద్, గోదావరిఖని, మంచిర్యాల, కరీంనగర్, హైదరాబాద్, కోరుట్ల, మెట్పల్లి తదితర ప్రాంతాలకు చెందిన వారు ‘నరసింహ శతక’ గ్రూపు ఏర్పాటు చేసి ప్రతిరోజూ ఒక పద్యపారాయణం చేస్తున్నారు. వంద పద్యాల ముగింపు సందర్భంగా ఆదివారం సుందిళ్ల నరసింహ స్వామి ఆలయంలో సామూహిక వంద పద్య పఠనం చేశారు. అనంతరం పవిత్ర మానస సరోవర యాత్ర పూర్తి చేసుకుని వచ్చిన చందా ఈశ్వర్కుమార్, పుష్పలత దంపతులను శాలువాలతో సన్మానించారు. నిర్వాహకులు కేశెట్ట సద్గుణ, కాచం సునీత, సరిత తదితరులు పాల్గొన్నారు.


