ఆసిఫాబాద్అర్బన్: భారీ వర్షాల నేపథ్యంలో గిరిజన గ్రామాల్లోని గర్భిణులకు ఎలాంటి ఇబ్బందులు రానీయొద్దని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. సిర్పూర్(యూ), లింగాపూర్ మండలాల్లోని పీహెచ్సీలను శుక్రవారం తనిఖీ చేశారు. ఆస్పత్రుల్లో నమోదైన గర్భిణుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆగస్టులో ప్రసవ తేదీలు ఉన్న గర్భిణులను గుర్తించి, ప్రసవానికి ముందే సమీప ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించాలని ఆదేశించారు. అనంతరం లింగాపూర్ మండలంలో భారీ వర్షాలతో రవాణా సౌకర్యం దెబ్బతిన్న భీమానాయక్ తండా, లొద్దిగూడ గ్రామాలను సందర్శించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. లింగాపూర్ ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. అత్యవసర సేవలకు అంతరాయం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భీమానాయక్ తండాకు ఆర్వో ప్లాంట్ మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.


