రెండు రోజులు జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలు వట్టివాగు, అడ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత ఉప్పొంగిన ప్రాణహిత, పెద్దవాగు, ఎర్రవాగు పరీవాహక ప్రాంతాల్లో వందలాది ఎకరాల్లో నీట మునిగిన పంటలు సర్వే చేసి పరిహారం అందించాలని రైతుల డిమాండ్
దహెగాం మండలం దిగిడ శివారులో నీట మునిగిన పంటను చూపుతున్న రైతు
ఈ ఫొటోలోని రైతు పేరు కుడ్మెత చిన్నన్న. పెంచికల్పేట్ మండలం గుండెపల్లి శివారులో తనకున్న మూడెకరాల్లో పత్తి పంట సాగు చేశాడు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దవాగు వరద పోటెత్తడంతో మూడెకరాల పంట నీట మునిగింది. సుమారు రూ.60వేల నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపాడు.
దహెగాం/పెంచికల్పేట్: జిల్లావ్యాప్తంగా బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి చెరువులు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నా యి. పెద్దవాగు, ఎర్రవాగులతోపాటు ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహించడంతో శుక్రవారం నాటి కి పరీవాహక ప్రాంతాల్లో పంట చేలు నీటమునిగా యి. వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పత్తి నీటిపాలు కావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు, వరద ఇలాగే కొనసాగితే పంట నష్టపోయే ప్రమాదం ఉంది.
చేలలోకి బ్యాక్వాటర్
భారీ వర్షాలతో వట్టివాగు, కుమురంభీం(అడ) ప్రాజెక్టుల్లోకి భారీగా వరద చేరింది. అధికారులు రెండు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. ఫలితంగా పెద్దవాగులోకి భారీగా వరద చేరింది. అలాగే ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురువడంతో ప్రాణహిత నది సైతం ఉప్పొంగింది. దహెగాం మండలంలోని పీపీరావు ప్రాజెక్టులోకి వరద చేరి అలుగు పోయడంతో వరద ఎర్రవాగులోకి చేరింది. ఓ వైపు వాగులు ఉప్పొంగడం, ప్రాణహిత నదికి సైతం భారీ వరద రావడంతో బ్యాక్ వాటర్ పత్తి చేలను ముంచెత్తింది. పెద్దవాగు, ఎర్రవాగు పరీవాహక ప్రాంతాల్లోని ఒడ్డుగూడ, మర్రిపల్లి, అమరగొండ, గెర్రె, గిరవెల్లి, కర్జి, దిగిడ, రాంపూర్, మొట్లగూడ ప్రాంతాల్లో పత్తి చేలు నీట మునిగాయి. అలాగే పెంచికల్పేట్ మండల కేంద్రంతోపాటు, మురళీగూడ, జిల్లెడ నందిగామ, కమ్మర్గాం, గుండెపల్లి, అగర్గూడ, ఎల్లూర్ గ్రామాల్లో వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరద ప్రవాహం ఇలాగే కొనసాగినా.. వర్షాలు కురిసినా చేలలో వరద రోజుల తరబడి నిలిచే అవకాశం ఉంది. నాలుగేళ్లుగా జిల్లా రైతులు వరదలతో పంటలు నష్టపోతున్నారు. ఈ ఏడాది పత్తి ఆశాజనకంగా ఉందని భావిస్తున్న తరుణంలో వరదలు వారి ఆశలను దెబ్బతీశాయి.


