ఎల్నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం అత్యవసర పంటల ప్రణాళిక అమలుకు చర్యలు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయశాఖ
చింతలమానెపల్లి: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడంతో వానాకాలం సాగుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. వర్షాధార పంటల సాగు ప్రశ్నార్థకమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అత్యవసర పంటల ప్రణాళికను (కాంటింజెన్సీ క్రాప్ ప్లాన్) అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేనందున సాగు సమయం కీలకంగా మారనుంది. వర్షాలు లేకపోతే భూగర్భ జలాలు సైతం పడిపోతాయి. ఈ నేపథ్యంలో బోర్లు, బావుల్లో నీటి లభ్యత లేక పంటలకు దీర్ఘకాలికంగా నీరందించే అవకాశాలు ఉండవు. ఆగస్టు 20 వరకు పత్తి, కంది, పెసర వంటి పంటల సాగు, ఆ తర్వాత నువ్వులు, జొన్న, సజ్జ వంటి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది.
లోటు వర్షపాతం.. దిగుబడిపై ప్రభావం
జిల్లాలో అధికారికంగా 4.56లక్షల ఎకరాల్లో సాగు భూమి ఉంది. ప్రధానంగా వరి, పత్తి, కంది సాగు చేస్తుంటారు. ఏటా 3 లక్షలకు పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగు, 60 వేల ఎకరాల్లో వరి, మిగతా భూముల్లో నీటి వనరులు తక్కువగా ఉండే ప్రాంతాల్లో పె సర వంటి పప్పుధాన్యాలు సాగు చేస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ సీజన్లో ఇప్పటివరకు 3.70 ఎకరాల్లో పత్తి, 23వేల ఎకరాల్లో వరి సాగైనట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా వర్షాకాలం జూన్ నుంచి అక్టోబర్ ఆరంభం వరకు ఉంటుంది. పంటలకు ఈ నాలుగు నెలల్లో కురిసే వర్షపాతమే కీలకం. జూన్ 1 నుంచి జూలై 27 వరకు జిల్లాలో 503.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 378.9 మి.మీ.లు మాత్రమే కురిసింది. 25శాతం లోటు నమోదైంది. ఈ ఏడాది వరి పంట నారుమడులకే పరిమితం కాగా, నాట్లు అతి తక్కువ విస్తీర్ణంలో పూర్తి చేశారు. సాగు లక్ష్యానికి, క్షేత్రస్థాయి సాగుకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. సాగు కాలంలో సగం రోజులు ఇప్పటికే గడిచిపోవడంతో సాగు, దిగుబడులపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.
జిల్లాలో వర్షపాతం (మి.మీ.)
నెల సాధారణం కురిసింది లోటు శాతం
జూన్ 188.6 155.2 18%
జూలై
(26 వరకు) 304.5 221.3 27%


