ఆసిఫాబాద్: భూగర్భ జలాల పెంపునకు ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని జన్కాపూర్ రైతు వేదికలో డీఆర్డీవో దత్తారావుతో కలిసి సోమవారం ఎల్నినో ప్రభావం, ఫారంపాండ్, సామాజిక ఇంకుడు గుంతల నిర్మాణాలు, ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు, విద్యార్థులకు ఏకరూపు దుస్తుల పంపిణీ అంశాలపై సెర్ప్ ఏపీఎంలు, సామాజిక సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉందని, కరువును ఎదుర్కొనేందుకు ప్రతీ నీటి బొట్టును భూమిలో ఇంకిపోయేలా ఇంకుడు గుంతలు, ఫారంపాండ్, సామాజిక ఇంకుడు గుంతలు, పంట కుంటలు, ఊట కుంటల ను వీబీ జీ రామ్జీ పథకం కింద యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేసి, కూలీల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు పండించడం ద్వారా అధిక ఆ దాయం పొందవచ్చని, కూరగాయల సాగు, పప్పు ధాన్యాల సాగు చేసేలా రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఆగస్టు 15లోగా జిల్లాలోని అన్ని యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు రెండు జతల ఏకరూప దుస్తులు అందించాలని, నిర్లక్ష్యం చేసే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతీ వీవో కింద 15 సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, కొత్త సభ్యులను చేర్పించి, నూతన సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాను సందర్శించి విత్తన ప్యాకెట్లు పరిశీ లించారు. ఎంపీడీవో ప్రవీణ్, వ్యవసాయ అధికారి మిలింద్, సెర్ప్ ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు.


