ఆసిఫాబాద్రూరల్: ఉపాధ్యాయులు విద్యార్థులను విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దాలని డీటీడీవో జాదవ్ అంబాజీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ క్రీడాపాఠశాలలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సైన్స్ టీచర్లకు ఏర్పాటు చేసిన ఐదు రోజుల శిక్షణ కార్యక్రమానికి సోమవారం ఏసీఎంవో ఉద్దవ్తో కలిసి హాజరయ్యారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఐసీటీ టూల్స్, ఏఐ వినియోగం గురించి వివరించారు. రానున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి మరింత సవాల్గా మారుతుందని, టీచర్లు నిరంతరం అప్గ్రేడ్ కావాలని సూచించారు. సమగ్ర విద్య అభ్యసన కార్యక్రమాలకు హాజరవుతూ వృత్తి నైపుణ్యాలు పెంచుకోవాలన్నారు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా బోధన చేయాలన్నారు. డిజిటల్ లిటరసీ మీద అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీవైఎస్వో షేకు, హెచ్ఎం లింబారావు తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని వినతి
గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఔట్సో ర్సింగ్, డైలీవేజ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డీటీడీవో అంబాజీకి వినతిపత్రం అందించారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం, పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, కార్మికులు సదాశివ్, లక్ష్మి, హీరాబాయి, లింగు, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


