ఆసిఫాబాద్: జిల్లాలోని పోలీస్ స్టేషన్ల పనితీరు మరింత మెరుగుపడాలని ఎస్పీ నితిక పంత్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రికార్డులు, క్రైం రికార్డులు, ఇన్ఫర్మేషన్ బుక్, రిజిస్టర్లు పరిశీలించారు. సబ్ డివిజన్ పరిధిలో నమోదవుతున్న గ్రేవ్ కేసులు, అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల్లో సీడీ ఫైల్స్, పెండింగ్ ట్రయల్లో ఉన్న సీడీ ఫైళ్లు పరిశీలించారు. గ్రేవ్ కేసులు, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని డీఎస్పీ అశోక్కు సూచించారు. ఎస్వోపీ ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేయాలని, 5 ఎస్ ఇంప్లిమెంటేషన్ పరిశీలించి ఫైలు సక్రమ పద్ధతిలో ఉండాలన్నారు. సబ్ డివిజన్ పరిధిలోని రౌడీ షీటర్లు, అక్రమ కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. గంజాయి రవాణా, విక్రయించే వారిపై నిఘా ఉండాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా స్టేషన్ పరిధిలో ఉన్న ప్రజలకు సైబర్ నేరాలు, సామాజిక అంశాలు, ట్రాఫిక్ నియామాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. అంతకు ముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. కార్యక్రమంలో సీఐలు సంజయ్, వేణుగోపాల్, బాలాజీ వరప్రసాద్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.


