ఆసిఫాబాద్: జిల్లాలో ప్రజాపంపిణీ ద్వారా రేషన్ కార్డులు, అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ వసతి గృహాలకు అందిస్తున్న సన్నబియ్యం పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గురువారం అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఆర్డీవో లోకేశ్వర్రావుతో కలిసి ఆహార భద్రత, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 315 చౌకధరల దుకాణాలు, 973 అంగన్వాడీ కేంద్రాలు, 1173 పాఠశాలలు, 115 సంక్షేమ వసతి గృహాలకు ప్రతినెలా 3,205 టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. ఖాళీగా ఉన్న 40 రేషన్ డీలర్ల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలను ఆదేశించారు. కొత్త రేషన్ దుకాణాలు ఏర్పాటుకు జాబితా సిద్ధం చేయాలన్నారు. ఈ నెల 31లోగా ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ రవాణా సౌకర్యం లేని గ్రామాలకు మూడు నెలల కోటా ఒకేసారి సరఫరా చేయాలని అన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీటీడీవో అంబాజీ, డీఈవో సచ్చిదానంద చారి, డీఎస్వో సాదిక్, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
డిజిటలైజేషన్ వందశాతం పూర్తి చేయాలి
ఆసిఫాబాద్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఎన్యూమరేషన్ ఫారాలు వందశాతం డిజిటలైజేషన్ పూర్తి చేయాలని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, డీఆర్వో దాసరి వేణు, ఆర్డీవో లోకేశ్వర్రావు, కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహినా సుల్తానా, ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రె ఆకాశ్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్తో కలిసి ఎస్ఐఆర్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిజిటలైజేషన్ 85.94 శాతం పూర్తయిందని తెలిపారు. మిగిలిన 14 శాతం పూర్తయ్యేందుకు రాజకీయ పార్టీలు, మున్సిపల్ పాలకవర్గాలు సహకరించాలన్నారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్ మున్సిపాలిటీల్లోని ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు అందించాలని సూచించారు. బూత్స్థాయి అధికారులకు ఫారాలు అందించని పక్షంలో ఓటు కోల్పోయే ప్రమాదముందని పేర్కొన్నారు. సమావేశంలో ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.


