ఆసిఫాబాద్రూరల్: ప్రధానోపాధ్యాయులు కేవలం పరిపాలన బాధ్యతలకే పరిమితం కావొద్దని, విద్యార్థుల అభ్యసన పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని డీఈవో సచ్చిదానంద చారి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ఎస్వోలకు బుధవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరై సూచనలు చేశారు. ప్రధానోపాధ్యాయులు నూతన విద్యావిధానం, ఎఫ్ఎల్ఎన్, అభ్యసన ప్రక్రియ, సమగ్ర పాఠశాలల నిర్వహణ, నాయకత్వ లక్షణాల అభివృద్ధి, ఉపాధ్యాయుల పర్యవేక్షణ, నిరంతర మూల్యంకనంపై దృష్ట సారించాలన్నారు. విద్యార్థి అభ్యసన స్థాయికి అనుగుణంగా విద్యాప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శ్రీనివాస్, రిసోర్స్ పర్సన్లు హనుమంతు, ప్రభోద్, నటరాజ్, అమరేందర్, జిల్లా పరీక్షల నిర్వహణ అధికారి జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.
సేంద్రియ సాగుతో లబ్ధి
కౌటాల: సేంద్రియ పద్ధతిలో పంటల సాగుతో రైతులకు లబ్ధి చేకూరుతుందని డీఏవో వెంకట్ అన్నారు. మండలంలోని ముత్తంపేట గ్రామంలో పంటలను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ జాతీయ సహజ వ్యవసాయ మిషన్లో ముత్తంపేట గ్రామం ఎంపికై నట్లు తెలిపారు. రసాయనాల వినియోగంతో భూసారం తగ్గడంతోపాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. కార్యక్రమంలో అధికారులు మనోహర్, విజయ్కుమార్, ఏఈవోలు సాగర్, సర్పంచ్ ఉష, ఉప సర్పంచ్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


