
మూడేళ్లుగా నష్టాలే..
ఈ ఫొటోలోని రైతు పేరు నందూసింగ్. రెబ్బెన మండల కేంద్రానికి చెందిన ఈయనకు పులికుంట శివారులో సుమారు 30 ఎకరాల్లో మామిడి తోట ఉంది. తోటల పెంపకంలో దాదాపు 50 ఏళ్ల అనుభవం ఉంది. ఒకప్పుడు టన్నుల కొద్దీ దిగుబడి సాధించాడు. కానీ కొన్నేళ్లుగా ఆశించిన దిగుబడి సాధించలేకపోతున్నాడు. వాతావరణ మార్పులతో చెట్లకు పూత, కాత రావడం లేదు. ఈసారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తోటలో వందలాది చెట్లు ఉంటే అతికొద్ది చెట్లకు మాత్రమే కాయలు ఉన్నాయి. అవి కూడా గాలిదుమారానికి రాలిపోతున్నాయి.. ఇలా నందుసింగ్ మాత్రమే కాదు. జిల్లాలో మామిడి తోటలు సాగు చేస్తున్న ప్రతీ రైతుది ఇంచుమించు ఇదే పరిస్థితి.
రెబ్బెన(ఆసిఫాబాద్): మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులకు మూడేళ్లుగా కాలం కలిసిరావడం లేదు. జిల్లాలోని తేలికపాటి భూములు తోటల పెంపకానికి అనుకూలంగా ఉండటంతో గతంలో ఏటా ఆశించిన ఫలసాయం పొందేవారు. వాతావరణం సైతం అనుకూలించి మంచి దిగుబడి దక్కేది. కానీ కొన్నేళ్లుగా పరిస్థితులు మారిపోయాయి. ఖర్చు లే కుండా దిగుబడి అందించిన తోటల్లో ఇప్పుడు పె ట్టుబడి కూడా రావడం లేదు. మూడేళ్లుగా మామిడి రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. వాతా వరణ మార్పుల ప్రభావం పూతకాతలపై పడింది. మరోవైపు పంట చేతికందే దశలో గాలిదుమారాలు, అకాల వర్షాలు నిండా ముంచుతున్నాయి.
ఆరంభం నుంచే ప్రతికూలం
జిల్లాలోని రెబ్బెన, తిర్యాణి, కాగజ్నగర్, సిర్పూర్(టి), జైనూర్ మండలాల్లో ఉద్యావనశాఖ అధికారుల లెక్కల ప్రకారం 982 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. సాధారణంగా కాయలు తెంపే దశలో వచ్చే గాలిదుమారాలు, అకాల వర్షాలతో తోటలు దెబ్బతింటాయి. ఈ ఏడాది మాత్రం సీజన్ ప్రారంభం నుంచే వాతావరణం ప్రతికూలంగా మారింది. జనవరి, ఫిబ్రవరిలో ఈదురుగాలులతో పూత రాలి పిందెల సంఖ్య తగ్గింది. ఇప్పటికీ ఇదే తరహా వాతావరణం ఉండటంతో కాయలు రాలిపోతున్నాయి. వాతావరణం అనుకూలిస్తే ఎకరం తోటలో సుమారు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈసారి ఉన్న ప్రతికూల పరిస్థితులతో దిగుబడి నాలుగు టన్నులకు మించేలా కనిపించడం లేదు.
136 ఎకరాల్లో నష్టం
సీజన్ ప్రారంభంలో పూతలు చూసి మురిసిపోయే రైతులకు ఆ సంతోషం చివరి వరకు ఉండడం లేదు. ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈదురుగాలులు కూడా తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని మామిడి తోటలు కోతదశకు చేరుకున్నాయి. కొన్ని రోజులుగా జిల్లా అంతటా వాతావరణం రోజుకో విధంగా మారుతోంది. పగటి పూట అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ.. సాయంత్రం ఆకాశం మేఘావృతమవుతూ బలమైన గాలులు వీస్తున్నాయి. గత నెలలో వడగండ్ల వానతో తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గాలుల ధాటికి చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. జిల్లాలో గాలులు, అకాల వర్షాలకు 136 ఎకరాల్లోని మామిడి తోటలకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానవన శాఖ అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ప్రభుత్వం పరిహారం అందిస్తుందా లేదా అనేది వేచిచూడాలి.
సరైన దిగుబడి లేని మామిడి
ఈ ఏడాది గాలిదుమారాలతో దెబ్బతింటున్న తోటలు
జిల్లాలో 136 ఎకరాల్లో పంట నష్టం
ధర ఉన్నా.. మార్కెట్ ఏది?
జిల్లాలో మామిడి తోటలు అధికంగానే ఉన్నా అందుబాటులో మార్కెంటింగ్ సౌకర్యం లేదు. స్థానిక రైతులు పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాగ్పూర్ మార్కెట్కు కాయలు తరలిస్తున్నారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలోని నాగ్పూర్కు తరలించేందుకు వాహనాల కిరాయి, లోడింగ్, అన్లోడింగ్ ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయి. మార్కెట్లో కమీషన్ కటింగ్ పేరుతో రైతులను మరింత దోచుకుంటున్నారు. గతేడాది ఈ సమయంలో నాణ్యమైన కాయలకు కిలోకు రూ.25 వరకు ధర పలకగా, ఈసారి ధర కాస్త ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం నాగ్పూర్, కరీంనగర్ మార్కెట్లలో కిలో కాయలకు రూ.60 నుంచి రూ.65 చెల్లిస్తున్నారు. దిగుబడి అంతంత మాత్రంగా ఉన్నా కాయలకు ధర ఉండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరే చివరివరకు కొనసాగుతుందనే నమ్మకం లేదు. పది రోజుల క్రితం నుంచే కోతలు మొదలయ్యాయి. పూర్తిస్థాయిలో పూర్తయితే మార్కెట్కు టన్నుల కొద్ది కాయలు వచ్చి ధర తగ్గవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. నాణ్యమైన కాయలకు మాత్రమే రూ.60 నుంచి రూ.65 వరకు చెల్లిస్తూ.. రాలిన కాయలకు మాత్రం కిలోకు రూ.20 లోపే చెల్లిస్తున్నారు.
సర్వే చేపట్టాం
ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు మామిడి తోటలకు అనుకూలంగా లేవు. సీజన్ మొదటి నుంచి వీస్తున్న ఈదురుగాలులు, గాలి దుమారాలతో పూత, కాత రాలిపోయింది. దానికి తోడు బలమైన గాలులకు కాయలు రాలిపోవడంతో పాటు కొమ్మలు, చెట్లు విరిగిపడి రైతులకు తీవ్రంగా నష్టాన్ని కలిగించాయి. మామిడి తోటలను పరిశీలించి సర్వే చేపట్టాం. జిల్లాలో 136 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించాం.
– ఎంఏ నదీం,
ఆసిఫాబాద్ డివిజన్ ఉద్యావన శాఖ అధికారి

మూడేళ్లుగా నష్టాలే..

మూడేళ్లుగా నష్టాలే..

మూడేళ్లుగా నష్టాలే..