
బిల్లు వెనక్కి తీసుకోవాలని ర్యాలీ
ఆసిఫాబాద్అర్బన్: వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ముస్లింలు డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా ము స్లిం పర్సనల్ లా బోర్డు ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జామా మసీదు నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మసీద్ ఇమామ్లు మౌలానా అయుజ్ అష్రఫీ, హఫీజ్ తహేర్ హష్మీ మాట్లాడారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ మల్లేశ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ఫయాజ్, అబ్దుల్లా, అమన్, ఉబెదిబిన్ యహియా, అబ్దుల్ రహమాన్, రాఫిక్ అహ్మద్, జావిద్ గులాం, అబ్బు, సలీం, సాజిద్, అహ్మద్, తాజ్, ఇమ్రాన్, ఆసిఫ్, జమీల్ తదితరులు పాల్గొన్నారు.