
టీకాతోనే పశువులకు రక్ష!
● ‘గాలికుంటు’ నివారణకు టీకాలు ● నెల రోజులపాటు కొనసాగనున్న కార్యక్రమం ● సద్వినియోగం చేసుకోవాలని అధికారుల సూచన ● జిల్లాలో 3.1 లక్షల పశువులు
కౌటాల(సిర్పూర్): ఏటా వివిధ రకాల వ్యాధులతో పశువులు, జీవాలు వందల సంఖ్యలో మృత్యువాత పడుతుండటంతో పోషకులు, రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పశువుల మరణాలు అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఏటా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం చేపడుతోంది. ఈ నెల 15 నుంచి జిల్లాలో ప్రారంభమైన టీకాల కార్యక్రమం మే 15 వరకు కొనసాగనుంది. పశువులకు సోకే వ్యాధులపై పాడిరైతులు అవగాహన కలిగి ఉంటూ సకాలంలో నివారణ టీకాలు వేయించాలని అధికారులు సూచిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు ఇలా..
గాలికుంటు వ్యాధి సూక్ష్మక్రిములతో వ్యాప్తి చెందుతుంది. వ్యాధి సోకిన గేదెలు, ఆవులు 24 గంటలోగా బక్కచిక్కి అల్సర్ బారిన పడతాయి. రెండు నుంచి ఆరు రోజుల వరకు జ్వరం ఎక్కువగా ఉంటుంది. నోరు, పెదాలు, నాలుక, చన్నులతో పాటు కాళ్ల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడి వ్యాధి ముదురుతుంది. వ్యాధి బారిన పడిన పశువులు ముడుచుకుని పడుకుంటాయి. మేత, నీళ్లకు దూరంగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి తగ్గడంతో పశువులు, దూడలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటి వాటికి క్రమం తప్పకుండా పరీక్షలు చేయించాలి. నోరు, పెదాలు, నాలుక, కాళ్లగిట్టల వద్ద ఉన్న పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ లేదా నార్మల్ సైలెన్ నీటితో శుభ్రం చేయాలి. రెండోసారి ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీ బయాటిక్స్ మందులు, వ్యాధి నిరోధక శక్తి పెంచేందుకు బీ కాంప్లెక్స్ మందులు వాడాలని పశువైద్యులు సూచిస్తున్నారు. పశువులకు గాలి ద్వారా సోకే గాలికుంటు వ్యాధిపై రైతులు నిర్లక్ష్యం వహించకుండా పశు సంవర్ధక శాఖ వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా ఏడాదికి రెండుసార్లు టీకాలు వేయించాలి. గాలికుంటు ప్రాణాంతకమైన వ్యాధి కావడంతో చిన్నపాటి అలసత్వం చేసినా పశువు మృతి చెందే ప్రమాదం ఉంటుంది. వ్యాధి బారిన పడిన పశువులను ఇతర వాటికి దూరంగా ఉంచాలి. ఎప్పటికప్పుడు పశువుల పాకను శుభ్రం ఉంచాలి. వారానికి ఒకసారి కొట్టంలో సున్నం చల్లి, క్రిమికీటకాల నివారణకు చర్యలు తీసుకోవాలి. వ్యాధి సోకిన గేదె, ఆవు నుంచి తీసిన పాలను 100 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసిన తర్వాతే తాగాలి. పశువు చనిపోతే గోతిలో వేసి బ్లీచింగ్ పౌడర్ చల్లి పాతిపెట్టాలి.
సద్వినియోగం చేసుకోవాలి
రైతులు పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించా లి. ఈ నెల 15 గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కా ర్యక్రమం ప్రారంభించాం. షెడ్యూల్ ప్రకారం మే 15 వరకు అన్ని గ్రామాల్లోని పశువులకు ఉచితంగా టీకాలు వేస్తాం. పశుపోషకులు, రైతులు స్వదినియోగం చేసుకోవాలి. టీకాలు వేయించడం ద్వారా పశువులు ఆరోగ్యంగా ఉంటాయి. మేకలు, గొర్రెలు, పశువులకు ఎలాంటి వ్యాధులు సోకినా పశువైద్యశాఖ సిబ్బందికి సమాచారం అందించాలి.
– సురేశ్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
ఏటా రెండుసార్లు..
వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమతో రైతులు ఆర్థికంగా బలపడుతున్న నేపథ్యంలో వారు నష్టపోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతీ సంవత్సరం రెండుసార్లు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. జిల్లాలో రెండు ఏరియా పశువైద్యశాలలు ఉండగా 18 ప్రాథమిక పశువైద్యాశాలలు ఉన్నాయి. ఏడు పశువైద్యాశాల సబ్సెంటర్లు ఉన్నాయి. ఆవులు, గేదెలు మొత్తం 3,13,896 ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జిల్లాలో ఈ నెల 15 నుంచి మే 15 వరకు నెల రోజులపాటు టీకాలు వేయనున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. షెడ్యూల్ ప్రకారం ప్రతీరోజు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు గ్రామాల్లోకి వెళ్లి టీకాలు వేస్తున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.

టీకాతోనే పశువులకు రక్ష!

టీకాతోనే పశువులకు రక్ష!