చింతకాని: మాదక ద్రవ్యాల రవాణా, అమ్మకాలను పూర్తిగా నియంత్రించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. చింతకాని పోలీసుస్టేషన్ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో పరిశీలించాక పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. అనంతరం సీపీ మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల కట్టడికి నిఘా పెంచడమే కాక వాటి బారిన పడకుండా విద్యార్థులు, యువత, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, సైబర్ మోసాల బారిన పడకుండా సదస్సులు నిర్వహించాలని తెలిపారు. అంతేకాక కేసుల నమోదులో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని, భూవివాదాల కేసుల్లో నిర్దేశిత స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) పాటించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి వేగంగా దర్యాప్తు చేపడుతూ మెరుగైన పోలీసింగ్ అమలుచేయాలని తెలిపారు.
పోలీసు కమిషనర్ సునీల్దత్


