మండలి సందడి ! | - | Sakshi
Sakshi News home page

మండలి సందడి !

Sep 19 2026 12:22 AM | Updated on Sep 19 2026 12:22 AM

షెడ్యూల్‌ విడుదల

విడుదలైన ఓటరు నమోదు షెడ్యూల్‌

కాంగ్రెస్‌ నుంచి అధిష్టానం వద్దకు అభ్యర్థుల పేర్లు

బీఆర్‌ఎస్‌ తరఫున రాకేష్‌రెడ్డి పర్యటన.. జనసేన నుంచి ‘గడల’ ఖరారు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. బీఆర్‌ఎస్‌ నుంచి రాకేష్‌రెడ్డి పేరు అధికారికంగా ఖరారు చేయకున్నా ఆయన ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక కాంగ్రెస్‌ నుంచి ముగ్గురు, నలుగురి పేర్లు అధిష్టానం వద్దకు వెళ్లాయి. మరోపక్క జనసేన నుంచి గడల శ్రీనివాస్‌ పేరు ఖరారైంది. ప్రస్తుతం ఓటర్ల నమోదు కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయడంతో ఆశావహులు ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

ఎన్నికలో బీఆర్‌ఎస్‌.. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా చింతపండు నవీన్‌(తీన్మార్‌ మల్లన్న) కొనసాగుతున్నారు. తొలుత ఈ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. అయితే, ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి గెలవగా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. 2024 మే 27న ఎన్నిక జరగ్గా జూన్‌ 8న వెలువడిన ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏ.రాకేష్‌రెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం సాధించారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది.

గ్రాడ్యుయేట్‌ ఎన్నిక కోసం..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై రాజకీయ పార్టీలు కొద్ది నెలలుగా వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్వహించిన సమావేశంలోనూ వచ్చే ఏడాది జరిగే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చించారు. వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు నుంచి నలుగురు పేర్లను అధిష్టానానికి సమర్పించారు. ఇక గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన రాకేష్‌రెడ్డి ఈసారి కూడా పోటీ చేయొచ్చనే అంచనాలతో ఉమ్మడి జిల్లాలో కొంతకాలంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే, జనసేన నుంచి గడల శ్రీనివాసరావు పేరు అధికారికంగా ప్రకటించగా.. బీజేపీ కూడా అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది.

రాజకీయ పార్టీల్లో కదలిక

ఓటర్ల దరఖాస్తు షెడ్యూల్‌ విడుదలతో రాజకీయ పార్టీల్లో కదలిక వచ్చింది. ప్రస్తుతం పార్టీలన్నీ ఓటర్ల నమోదును ప్రాధాన్యతగా తీసుకుంటున్నాయి. పార్టీల తరఫున ఎక్కువ మంది ఓటర్లను నమోదు చేయిస్తేనే గెలుపునకు అవకాశం ఎక్కువగా ఉంటుందనే భావనతో ఆశావహులు ఆ దిశగా దృష్టి సారించారు. ఈనెల 28న నోటిఫికేషన్‌ విడుదలైన అనంతరం ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా ఓటర్ల నమోదును చేయించాలనే భావనతో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే టికెట్‌ ఖరారైన వారితోపాటు అభ్యర్థిత్వంపై ఆశ ఉన్న వారంతా గత ఓటర్ల జాబితా ఆధారంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతీసారి కొత్త ఓటర్ల జాబితా తయారు చేస్తారు. ఈక్రమాన వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఎన్నికల కోసం పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఓటరు నమోదుకు ఈనెల 28న నోటిఫికేషన్‌ జారీ కానుండగా, నవంబర్‌ 6వ తేదీ వరకు ఫారం – 18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అదేనెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం అనంతరం డిసెంబర్‌ 30న తుది ఓటరు జాబితా విడుదల చేస్తారు. ఈ ఏడాది నవంబర్‌ 1వ తేదీ నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లయిన వారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.

ఉమ్మడి జిల్లాలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ హడావుడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement