● నోటిఫికేషన్ విడుదల... అక్టోబర్ 9న పోలింగ్ ● రీజియన్లోని ఏడు డిపోల్లో 1,700 మంది ఓటర్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీలో గుర్తింపు సంఘం కోసం ఎన్నికల నిర్వహణ కు రాష్ట్ర కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. షెడ్యూల్ ప్రకటించడంతో ఖమ్మం రీజియన్లో ఎన్నికల హడావిడి మొదలైంది. అక్టోబర్ 9న గుర్తింపు సంఘం ఎన్నికకు పోలింగ్ నిర్వహించేందుకు కార్మిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో శుక్రవారం సాయంత్రం నుంచే కార్మిక సంఘాల నేతలు ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు.
రెగ్యులర్ ఉద్యోగులకే ఓటు హక్కు
ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో దాదాపు 1,700 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. శ్రామిక్లు, మెకానిక్లు, కండక్టర్లు, డ్రైవర్లు, ఏడీసీలు, కంట్రోలర్లకు మాత్రమే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉంటుంది. వీరంతా రెగ్యులర్ ఉద్యోగులై ఉండాలి. ఇక ఆపై స్థాయి అధికారులు, సెక్యూరిటీ సిబ్బందికి ఓటు హక్కు ఉండదు. త్వరలోనే యూనియన్ల తరఫున ఓటర్ల జాబితాను కార్మిక శాఖ సంఘాల నాయకులకు అందజేస్తారు. కాగా, గుర్తింపు ఎన్నికల్లో ఒక్కో ఓటరు రెండేసి ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఇందులో రాష్ట్ర గుర్తింపు కోసం క్లాజ్–3 ఓటు, జిల్లా గుర్తింపు కోసం క్లాజ్–6 ఓటు వేయనున్నారు.
రీజియన్లో పోటాపోటీ
ప్రభుత్వం ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన రోజు నుంచే యూనియన్లు తమ బలాబలాలను ప్రదర్శించేందుకు పోటీ పడుతున్నాయి. ప్రధాన కార్మిక సంఘాలు తమ అనుయాయులతో సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్మికుల సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడం వంటివి మొదలుపెట్టారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ రావడంతో కార్మిక సంఘాలు జోరు పెంచనున్నాయి.


