తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు సాయుధ పోరుకు కేంద్రబిందువుగా నిలిచింది. పుచ్చలపల్లి సుందరయ్య, మంచికంటి రామకిషన్రావు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చండ్ర రాజేశ్వరరావు, మల్లు స్వరాజ్యం, భీంరెడ్డి నర్సింహారెడ్డి వంటి అగ్రనేతలు ఇక్కడే వ్యూహాలు రచించారు. దున్నేవాడిదే భూమి నినాదంతో భూములను పంచిపెట్టారు. దళ కమాండర్ రాయల వెంకటనారాయణ నేతృత్వాన పలువురు రజాకార్లపై పోరాడి అమరులయ్యారు. ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన ఏరియా కమాండర్ మచ్చ వీరయ్య, ఆయన కొరియర్ కృష్ణమూర్తిని 1949 జనవరి 17న వాగు వద్ద నిజాం బలగాలు కాల్చి చంపాయి. అలాగే మేడేపల్లికి చెందిన యువకులు నల్లమల గిరిప్రసాద్ నాయకత్వాన అడవుల్లో ఉంటూ రజాకార్లపై పోరాడారు.


