మునుపటిలాగే నగదు లావాదేవీలు
పెరిగే అవకాశం
ఇదే జరిగితే తప్పని ‘చిల్లర’ సమస్య
అన్ని బిల్లులు ఫోన్ ద్వారానే..
వ్యాపారుల నడ్డి విరిచే చర్య
యూపీఐ చార్జీలు అదనపు భారం
నగదు లావాదేవీలే బెటర్
రకం సగటు యూపీఐ వార్షిక
బిల్లు చార్జీ భారం
విద్యుత్ బిల్లు రూ.2,000 రూ.5 రూ.60
తాగునీరు రూ.2,100 రూ.5 రూ.60
పిల్లల విద్య రూ.6,000 రూ.5 రూ.60
ఇంటర్నెట్ రూ.2,200 రూ.5 రూ.60
పెట్రోల్ రూ.3,000 రూ.5 రూ.60
బీమా ప్రీమియం రూ.3,500 రూ.5 రూ.60
నెలకు ఆరు లావాదేవీలపై రూ.30, ఏటా రూ.360 అవుతుంది. ఇవి నెలవారీ బిల్లులే కాగా, రూ.2 వేలు దాటే బట్టలు, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లపై మరింత భారం తప్పదు. రూ.10 వేల కొనుగోలుపై రూ.40 అనుకున్నా జిల్లాలోని 3 లక్షల మధ్యతరగతి కుటుంబాలపై ఏటా సుమారు రూ.15 కోట్ల అదనపు భారం పడనుందని అంచనా.
ఖమ్మంగాంధీచౌక్: డిజిటల్ ఇండియా పేరుతో ఇన్నాళ్లూ ఉచితంగా అందించిన యూపీఐ సేవలపై ఇప్పుడు చార్జీలు అమలుకానున్నాయి. రూ.2 వేలు దాటిన ప్రతీ చెల్లింపుపై రూ.5 ఫ్లాట్ చార్జీ విధిస్తూ ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తీసుకున్న నిర్ణయంపై జిల్లా వ్యాపారులు, ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇంటి బడ్జెట్ తడిసి మోపెడుతున్న తరుణాన యూపీఐ చార్జీలు భారమవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రూ.2 వేలు దాటితే...
ఎన్పీసీఐ నిర్ణయం వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపే డబ్బు(వ్యక్తి నుంచి వ్యక్తికి)పై, రూ.2 వేల లోపు దుకాణాల్లో కొనుగోళ్లపై ఎలాంటి చార్జీ ఉండదు. విద్యుత్, తాగునీరు, గ్యాస్, టెలికాం, రైల్వే టికెట్లు, పెట్రోల్ బంకులు, విద్యాసంస్థల ఫీజులు, ఇన్సూరెన్స్ ప్రీమియం లాంటి 15 రకాల అత్యవసర సేవలకు రూ.2 వేలు దాటితే ఒక్కో లావాదేవీకి రూ.5 చొప్పున వ్యాపారి ఖాతా నుంచి కట్ చేస్తారు. ఇతర షాపింగ్లకు 0.4 శాతం చొప్పున కట్ అవుతుంది. నూతన విధానం అమల్లోకి వస్తే మళ్లీ నగదు లావాదేవీలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఫలితంగా చిల్లర సమస్య ఎదురుకానుంది.
అయోమయం
యూపీఐ చార్జీల అంశం అన్నివర్గాల ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. యూపీఐ చార్జీల భారం వ్యాపారులే కట్టాలని చెబుతున్నా వారు వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఖమ్మంలోని పలు ప్రాంతాల వ్యాపారులు ఇప్పటికే ‘రూ.2 వేలపైన యూపీఐ లేదు, ఓన్లీ క్యాష్’ అంటూ బోర్డులు ఏర్పాటుచేస్తున్నారు.
నెలకు రూ.3 వేల కోట్లకు పైగానే..
జిల్లాలో నెలకు సుమారు రూ.3 వేల కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. ఇందులో రూ.2 వేలు దాటే అత్యవసర బిల్లుల లావాదేవీలు నెలకు 1.5 లక్షల వరకు ఉంటాయి. అంటే జిల్లా నుంచే నెలకు రూ.7.5 లక్షలు, ఏటా దాదాపు రూ.90 లక్షలు చార్జీల రూపంలో వెళ్లనుంది. ఇది రానురాను మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.
యూపీఐ చార్జీలపై
జనం పెదవి విరుపు
నిత్యావసర సరుకులు, కరెంట్ బిల్లు, గ్యాస్, ఇన్సూరెన్స్, పిల్లల ఫీజులన్నీ ఫోన్ పే ద్వారానే చెల్లిస్తా. రూ.2 వేలు దాటిన బిల్లుకు రూ.5 అంటే నెలకు రూ.20–30 అదనం. చూడడానికి చిన్నమొత్తమే అయినా ఏటా రూ.400 దాటడం ఖాయం.
– మాదంశెట్టి శ్రీనివాసరావు, ఖమ్మం
యూపీఐపై చార్జీలు వ్యాపారులకు భారమే. ఇప్పటికే వ్యాపారాలు పడిపోయాయి. ఈ తరుణాన చార్జీ విధించడం సరికాదు. వ్యాపారాలు చేసే వారిపై ఈ చర్య భారమవుతుంది. ప్రభుత్వం పునరాలోచించాలి. – సోమ నర్సింహారావు,
ప్రధాన కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్
ఇప్పటికే ఉన్న పన్నుల మోతకు యూపీఐ చార్జీలు అదనపు భారమవుతాయి. 80 శాతం మంది వినియోగదారులు యూపీఐ చెల్లింపులు చేస్తుండగా, ఇందులో 20 శాతం మంది బిల్లు రూ.2 వేలు దాటుతుంది. దీంతో వ్యాపారులకు భారం తప్పదు.
– జి.రమేష్, శ్రీరామేశ్వర మెడికల్ షాప్, గాంధీచౌక్
చార్జీలు చూస్తుంటే నగదు లావాదేవీలే మంచిదనిపిస్తుంది. నగదు రహిత లావాదేవీలు అలవాటు చేసిన ప్రభుత్వం ఇప్పుడు చార్జీలు విధించడం సరికాదు. వ్యాపారులపైనే భారమని చెబుతున్నా అంత మేర మా దగ్గరే వసూలు చేస్తారు.
– శీలం కార్తీక్, ప్రైవేట్ ఉద్యోగి, ఖమ్మం


