ఖమ్మం వైద్యవిభాగం: వరుస సెలవుల అనంతరం మంగళవారం ఖమ్మం జనరల్ ఆస్పత్రి కిటకిటలాడింది. వాతావరణంలో వచ్చే మార్పులతో దగ్గు, జలుబు, జ్వరం, ఒంటినొప్పులతో బాధపడుతున్న పలువురు ఆస్పత్రి బాట పట్టారు. దీంతో ఓపీ వద్ద ఉదయం 8గంటలకే క్యూ మొదలైంది. అలాగే, ఆస్పత్రిలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సైతం రద్దీ నెలకొంది.
ఎండలో ఎదురుచూపులు
జనరల్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం దివ్యాంగులను పరీక్షించేందుకు నిర్వహించిన సదరమ్ శిబిరానికి 230మంది హాజరయ్యారు. అయితే, యూడీఐడీ భవనం వద్ద షెడ్డు 50 – 60 మంది మాత్రమే సరిపోతుండగా, మిగతా దివ్యాంగులు, వారి సహాయకులు ఎండలో వేచి చూడాల్సి వచ్చింది. కనీసం టెంట్లు ఏర్పాటు చేయకపోవడం, ఇంతకాలం నీడ ఇచ్చిన చెట్లను తొలగించడంతో అవస్థ ఎదురైంది.


