● వైద్యులు, సిబ్బంది శ్రద్ధ వహించాలి ● కలెక్టర్ దివాకర టీ.ఎస్.
మధిర: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే వారికి సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. ఇందుకోసం వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. మధిర ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవలు, వైద్యులు, సిబ్బంది హాజరు, ల్యాబ్ పరీక్షలు, ఔషధాల లభ్యత, వార్డులు, పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించి చికిత్స కోసం వచ్చిన వారితో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ దివాకర మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం కావాలని తెలిపారు. పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించడమే కాక తాగునీరు, విద్యుత్ వసతులు మెరుగుపర్చాలని చెప్పారు. తొలుత కలెక్టర్ మధిరలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అదనపు భవన నిర్మాణ పనులను పరిశీలించి సూచనలు చేశారు. అలాగే, మధిర మండలం సిరిపురంలో జూనియర్ కళాశాల, ఐటీఐ భవనం, ఏఐటీసీ సెంటర్ పనులను కూడా తనిఖీ చేశారు. తహసీల్దార్ రాంబాబు, విద్యశాఖ ఇంజనీరింగ్ అధికారి బుగ్గయ్య తదితరులు పాల్గొన్నారు.
నర్సింగ్ కళాశాల పనులు ప్రారంభించాలి
చింతకాని: ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. చింతకాని మండలం లచ్చగూడెంలో నర్సింగ్ కళాశాల నిర్మాణ ప్రాంతాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఇప్పటివరకు కాంట్రాక్టర్ పనులను ప్రారంభించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు నీరు, విద్యుత్ సౌకర్యం కల్పించి పనులు మొదలయ్యేలా చూడాలని తెలిపారు. ఈ విద్యా సంవత్సరం కళాశాల నిర్వహించేందుకు మినీ స్టేడియం, ఇండోర్ స్టేడియాలను పరిశీలించారు. సర్పంచ్ కొప్పుల రజిని, కళాశాల ప్రిన్సిపాల్ రాజమణి, కాంగ్రెస్ నాయకులు కొప్పుల గోవిందరావు, గొడుగు రమేష్ పాల్గొన్నారు.
ఇంటిగ్రేటెడ్ పాఠశాల పనుల్లో వేగం
బోనకల్: బోనకల్ మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ దివాకర సూచించారు. నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన మాట్లాడుతూ నిర్మాణాలను నిర్ణీత సమయంలో నాణ్యతో పూర్తిచేయాలన్నారు. తహసీల్ధార్ సుధాకర్, ఉద్యోగులు నర్సింహారావు, నాగేశ్వరావు పాల్గొన్నారు.


