ఖమ్మంవ్యవసాయం: వరిలో ప్రభుత్వం సూచించిన ఏడు సన్న రకాలు సాగు చేస్తున్న రైతులు వివరాలను ఆన్లైన్ చేయించుకునే గడువును పొడిగించారు. విత్తనాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్ద ఈనెల 17లోగా నమోదు చేయించుకోవచ్చని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు. నిర్దేశించిన సన్న రకాలు కొనుగోలు చేసిన డీలర్ల వద్దకు బిల్లులతో వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలని, సొంత విత్తనాలైతే ఏఈఓలను సంప్రదించాలని సూచించారు. ఆన్లైన్లో నమోదు చేయించుకున్న రైతులకు ప్రభుత్వం ఇచ్చే బోనస్ అందుతుందని డీఏఓ ఓ ప్రకటనలో తెలిపారు.
రేపు జాతీయ
లోక్ అదాలత్
ఖమ్మం లీగల్: అత్యధిక కేసుల పరిష్కారం, కక్షిదారులకు సత్వర న్యాయమే లక్ష్యంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి దేవీమానస తెలిపారు. ఇందుకోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఆదేశాలతో ఖమ్మంలో పలు బెంచ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీ పడదగిన అన్ని క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద కేసులు, చెక్ బౌన్స్, మనోవర్తి, కుటుంబ తగాదాల కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. అంతేకాక ట్రాఫిక్ కేసులు, సైబర్ క్రైమ్ కేసుల పరిష్కారానికి వీలున్నందున కక్షిదారులు ముందుకు రావాలని న్యాయమూర్తి ఓ ప్రకటనలో సూచించారు.


