కూసుమంచి: మత్స్యకారులు, మత్స్య రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబిస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని యూనియన్ బ్యాంకు పాలేరు మేనేజర్ వెంకట ఫణీంద్రకుమార్ తెలిపారు. పాలేరులోని మత్స్య పరిశోధన కేంద్రంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, వరంగల్ జిల్లాల మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ గురువారం ముగిసింది. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ.. మత్స్య రైతులు శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగా ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. అనంతరం బ్యాంకు ద్వారా అందే రాయితీలను వివరించగా పరిశోధన కేంద్రం పూర్వ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జి.విద్యాసాగర్రెడ్డి మాట్లాడాక మత్స్యకారులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, శాస్త్రవేత్తలు శాంతన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


