తల్లాడ: రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యానికి సరిపడా సీఎంఆర్ ఇవ్వకపోవడంతో అధికారులు ఇటీవల తనిఖీలు చేస్తున్నారు. అయితే, మిల్లుల్లో ధాన్యం బస్తాలపై లాట్గా వేస్తుండగా.. లెక్కించడం ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యాన జిల్లాలోని తహసీల్దార్లకు బుధవారం తల్లాడ రైస్మిల్లుల వద్ద బస్తాల లెక్కింపుపై శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖా కమిషనర్ ఆదేశాల మేరకు ఇచ్చిన శిక్షణలో అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, డీఎస్ఓ చందన్కుమార్ పాల్గొని సిబ్బంది ద్వారా అవగాహన కల్పించారు. ఇకపై మిల్లులకు కేటాయించిన ధాన్యం, ఇచ్చిన సీఎంఆర్, మిగులు ధాన్యం ఎంత అనే వివరాలను ప్రతీ బుధవారం లెక్కించాల్సి ఉంటుందని తెలిపారు.


