కూసుమంచి: కూసుమంచి మండలం పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2027–28 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ప్రస్తుతం 8, 10వ తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈనెల 30వ తేదీలోగా నవోదయ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొన్నారు. అభ్యర్థులకు వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ – ఖమ్మం రూట్లో కొత్త పాయింట్లు
ఖమ్మంమయూరిసెంటర్: హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చే ప్రయాణికుల కోసం టీజీఎస్ ఆర్టీ సీ కొత్త బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారు ఆయా పాయింట్లను ఎంచుకోవచ్చని ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపా రు. తద్వారా ప్రయాణికులు ఎంజీబీఎస్కు వెళ్లే అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈమేరకు నల్లగొండ క్రాస్ రోడ్, కొత్తపేట క్రాస్ రోడ్, అష్టలక్ష్మి టెంపుల్, ఎల్బీ.నగర్ మెట్రో పిల్లర్ నంబ ర్ 1665, పనామా, హయత్నగర్, పెద్ద అంబర్పేట్, రామోజీ ఫిలింసిటీ, ఓఆర్ఆర్ ఎగ్జిట్(సంపూర్ణ హోటల్), అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతా ల్లో బోర్డింగ్ పాయింట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డీఎం ఒక ప్రకటనలో వెల్లడించారు.
మలేషియా నిర్మాణ రంగంలో ఉపాధి అకాశాలు
ఖమ్మం రాపర్తినగర్: అర్హత, నైపుణ్యం కలిగిన కార్మికులకు మలేషియాలోని నిర్మాణరంగంలో తెలంగాణ ఓవర్సీస్ పవర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యాన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి తెలిపారు. పైప్ వెల్డర్, స్టీల్ వర్క్, కాంక్రీట్, ఆపరేటర్, ట్రెంచింగ్ తదితర పనుల్లో నైపుణ్యం కలిగిన వారు అర్హులని పేర్కొన్నారు. ఎస్సెస్సీ, ఇంటర్, డిప్లామా, ఐటీఐ అర్హత కలిగి 20–35 ఏళ్ల వయస్సు, పనుల్లో నైపుణ్యం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం www.tom. telagana.gov.in వెబ్సైట్ లేదా 08035524946 నంబర్లో సంప్రదించాలని ఉపాధి కల్పన అధికారి ఓ ప్రకటనలో సూచించారు.
జాతీయ రహదారికి
మరమ్మతులు
కొణిజర్ల: ఖమ్మం – సత్తుపల్లి జాతీయ రహదారికి ఎట్టకేలకు మరమ్మతులు మొదలయ్యాయి. కొణిజర్లలోని పోలీస్స్టేషన్ వద్ద నుంచి వైరా శివారు అయ్యప్ప స్వామి ఆలయం వరకు రోడ్డు గుంతలమయంగా వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. అంతేకాక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో పలు పార్టీల నాయకులు అధికారులకు వినతిపత్రాలు ఇవ్వడమే కాక కొందరు స్వయంగా మరమ్మతులకు ప్రయత్నించారు. ఈమేరకు ఎన్హెచ్ఐఏ అధికారులు స్పందించారు. రెండు రోజులుగా కొణిజర్ల పోలీస్స్టేషన్ నుంచి స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజీ వరకు కి.మీ. మేర పాత తారు తొలగించి కొత్తగా వేసే పనులు చేయిస్తున్నారు.
వీఓ భవనాల్లో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు
నేలకొండపల్లి: స్వయం సహాయక సంఘాల సభ్యుల సౌకర్యార్ధం ప్రతీ గ్రామపంచాయతీలో గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణం చేపట్టారు. జిల్లాకు 483 వీఓ భవనాలను మంజూరు చేయగా ఒక్కో భవనానికి రూ.10 లక్షలు కేటాయించారు. ప్రస్తుతం పనులు జరుగుతుండగా, భవనాల్లో శానిటేషన్ కాంప్లెక్స్ నిర్మాణానికి సైతం ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకోసం రూ.1.25 లక్షలు వెచ్చించనుండగా, ఎస్బీఎంజీ నిధులు రూ.87.500, పంచాయతీ లోని 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.37,500 కేటాయిస్తారు. ఈ మేరకు పంచాయతీల నుంచి వెంటనే తీర్మానాలు పంపించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. కాంప్లెక్స్ నిర్మాణాలను ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం చేపట్టాల్సి ఉంటుంది.


