ఆదరణ పెరిగింది..
● రైల్వేస్టేషన్ నుంచి పోస్టాఫీస్ ఆవరణలోకి కార్యాలయం ● ఉదయం 8నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం రైల్వే మెయిల్ సర్వీస్(ఆర్ఎంఎస్) సేవలను సంస్థ మరింతగా విస్తృతపరిచింది. ఖమ్మం రైల్వేస్టేషన్లో కొనసాగిన ఆర్ఎంఎస్ కార్యాలయాన్ని కొన్నాళ్ల క్రితం హెడ్ పోస్టాఫీస్ ఆవరణలోని భవనంలోకి మార్చారు. ఇక్కడ స్పీడ్ పోస్టులు, స్పీడ్ పోస్టు పార్సిల్ సేవలు ఉన్నాయి.
అదనపు కౌంటర్లు, పనివేళల పెంపు
రైల్వేస్టేషన్లో ఆర్ఎంఎస్ కార్యాలయం ఉన్నప్పుడు ఒకే కౌంటర్ ద్వారా రాత్రి 7నుంచి 11 గంటల వరకు సేవలందేవి. కానీ పోస్టాఫీస్లోకి మార్చాక రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి పనివేళలు సైతం పెంచారు. వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉండేలా ఉదయం 8నుంచి రాత్రి 11 గంటల వరకు ఆర్ఎంఎస్ విభాగం సేవలందిస్తోంది. ఖమ్మం తపాలా డివిజన్ పరిధిలోని 72 తపాలా శాఖల నుంచి వచ్చే స్పీడ్ పోస్టులు, స్పీడ్ పార్సిల్ పోస్టులను సార్టింగ్ చేయడం, తిరిగి నిర్దేశిత ప్రాంతాలకు పంపడం ఈ విభాగం ద్వారా జరుగుతుంది. అంతేగాక నేరుగా వచ్చే వినియోగదారుల నుంచి కూడా స్పీడ్ పోస్టులు, పార్సిళ్లను స్వీకరిస్తారు.
రెవెన్యూలో పురోగతి
స్టేషన్లో కార్యాలయం ఉన్నప్పుడు నెలకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం ఉండేది. కానీ పోస్టాఫీస్ళోకి మార్చి కౌంటర్లు, పని వేళలు పెంచడంతో ఆదాయం నెలకు రూ.4 లక్షలు దాటుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు వాణిజ్య, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఆర్ఎంఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. పలు సంస్థలు బల్క్ పార్సిళ్లను పంపించేందుకు ముందుకొస్తున్నారు.
రైల్వే మెయిల్ సర్వీసెస్కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరిగింది. వేగవంతమైన, పారదర్శకమైన, నాణ్యమైన సేవలను అందిస్తుండడంతో ముందుకొస్తున్నారు. గతంతో పోలిస్తే రెవెన్యూ పెరిగింది. – జమాల్ పాషా, ఆర్ఎంఎస్ ఉద్యోగి


